
ఆసుపత్రిలో రాము కుటుంబసభ్యలను ఓదారుస్తున్న మంత్రి దాడిశెట్టి రాజా
తుని: తొండంగి మండలం శృంగవృక్షంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన నడిపల్లి రాము కుటుంబానికి న్యాయం చేస్తామని రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. బుధవారం తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మృతుడు రాము కుటుంబం సభ్యులను పరామర్శించారు. మార్చురీలో రాము మృతదేహాన్ని పరిశీలించి నివాళులు అర్పించారు. మంగళవారం రాత్రి శృంగవృక్షం నూకాలమ్మ జాతరలో రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ ఒకరి ప్రాణాలను తీసింది. తొండంగికి చెందిన రాము జాతర చూసేందుకు వెళ్లాడని స్థానికంగా ఉన్న రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరిపై మరొకరు పరస్పరం దాడులు చేసుకున్నారన్నారు. ఘర్షణతో సంబంధంలేని రాముపై రాళ్లతో దాడిచేయడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు మంత్రి రాజాకు తెలిపారు. దీనిపై ఆయన స్పందిస్తూ రాము మృతికి కారకులైన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాఽథ్ బాబుతో ఫోన్లో మాట్లాడారు. ఈ కేసులో ఎవ్వరిని వదిలే ప్రసక్తి లేదని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు. మృతుడి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందించారు. రాము మృతికి కారకులైన వ్యక్తులపై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తు అధికారిగా ఎస్టీ, ఎస్సీ సెల్ డీఎస్పీ బి.అప్పారావుకు, పర్యవేక్షణను జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మన్)కు అప్పగించారు. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ ిపికెట్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఎస్బీ డీఎస్పీ అంబికా ప్రసాద్, పెద్దాపురం ఇన్చార్జి డీఎస్పీ మురళీమోహన్, కాకినాడ క్రైమ్ డీఎస్పీ ఎస్.రాంబాబు పాల్గొన్నారు.
బాధితుడి కుటుంబానికి
అండగా ఉంటాం
మంత్రి దాడిశెట్టి రాజా