రాజోళి: ‘మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ’ చందంగా మారింది రైతుల పరిస్థితి. పంటను పండించే వరకు నానా కష్టాలు పడి కాపాడుకుంటే.. కోత కోసి అమ్ముకుందామనేలోగా ప్రకృతి వైపరీత్యాలతో పూర్తిగా దెబ్బతింటుంది. ఈ ఏడాది కూడా రైతుకు పూర్తిస్థాయిలో నష్టమే జరిగినట్లుగా అధికారుల అంచనాలు తెలుస్తున్నాయి. జిల్లాలో గత నెలలో కురిసిన అకాల వర్షాలకు కోతకు సిద్ధంగా ఉన్న అరటి, మినుము, మామిడి పంటలతోపాటు.. అత్యధికంగా సాగవుతున్న వరి పంట పూర్తిగా దెబ్బతినడంతో పైసా చేతికి రాలేదని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
జిల్లా పరిధిలో ఇలా..
గత నెలలో ఉరుములు, మెరుపులతో కురిసిన అకాల వర్షం కారణంగా పలుచోట్ల పంటలపై ప్రభావం తీవ్రంగా పడింది. రాజోళి మండలంలోని మాన్దొడ్డితోపాటు చుట్టు పక్కల గ్రామాలు, అయిజ మండలంలో తీవ్రంగా చూపడంతో ఆ ప్రాంతంలో ఉన్న రైతులు రూ.లక్షల్లో నష్టపోయారు. గంటల వ్యవధిలోనే జిల్లా ఉన్నతాధికారులు గ్రామాలకు చేరుకుని పంటలను పరిశీలించారంటే నష్టం ఎంత మొత్తంలో ఉంటుందో ఊహించవచ్చు. అధికారుల అంచనా వేసిన దాని ప్రకారం 33 శాతంపైగా పంట దెబ్బతిందని గుర్తించారంటే ఆ పంటలు అసలు పనికి రావని నిర్ధారణ అయినట్లే. అలాంటి జాబితాలో ప్రస్తుతం పంటల వివరాలు నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు 1,800 ఎకరాలకుపైగా (80 శాతం) పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. వరి కంకి మొత్తం రాలిపోయి.. పైరు అడ్డం పడిపోయి, నేలరాలిన గింజ దేనికి పనికి రాకుండా పోయిందని రైతులు వాపోతున్నారు.
జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి బలైన రైతు
అధికారుల అంచనాల్లోనే 1,800 ఎకరాలకుపైగా పంట నష్టం
జిల్లాలో సింహభాగం
నష్టపోయింది వరి రైతులే..
85 శాతం మేర పూర్తిగా
నష్టపోయినట్లు గుర్తింపు
పరిహారంపైనే రైతుల ఆశలు


