ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యాసంగిలో 8,33,679 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అయితే ప్రభుత్వం గ్రేడ్–1 సన్న వడ్లు క్వింటాల్కు మద్దతు ధర రూ.2,389, గ్రేడ్–2కు రూ.2,369 ఇస్తోంది. దీంతోపాటు సన్నాలకు బోనస్ కింద క్వింటాల్కు రూ.500 చొప్పున చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు సన్నాల సాగుకే మొగ్గు చూపారు. 5,31,181 ఎకరాల్లో సన్న ధాన్యం సాగు చేయగా.. 3,02,498 ఎకరాల్లో రైతులు దొడ్డు రకం వరి సాగు చేశారు. అయితే సన్నాలను కొనేందుకు ప్రైవేట్ వ్యాపారులు ముందుకు వస్తున్నా.. దొడ్డు రకాల ధాన్యం కొనేందుకు ఇష్టపడడం లేదు. పలు ప్రాంతాల్లో మాత్రమే దళారులు దొడ్డు రకం వడ్లను క్వింటాకు రూ.2,200లోపు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రైతులు ప్రభుత్వ కేంద్రాల్లో రోజుల తరబడి నిరీక్షిస్తూ.. కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.
ఆశలు.. అడియాసలు
ప్రస్తుతం ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో పలు ప్రాంతాల్లో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పూర్తిగా ఆరబెట్టిన సన్న వడ్లు క్వింటాకు రూ.2,400 నుంచి రూ.2,450.. తేమ ఉంటే రూ.2,300 నుంచి రూ.2,350 వరకు వెచ్చించి దళారులు కొనుగోలు చేస్తున్నారు. వెంటనే డబ్బులు చెల్లిస్తుండడంతో రైతులు వారి వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే బోనస్ ఆశతో సన్నాలు పండించిన రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బోనస్ చెల్లించాల్సి వస్తుందనే ప్రభుత్వం కావాలని కొనుగోలు చేయకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు.


