అమరచింత: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు కేజీ రామచందర్ ఆరోపించారు. మంగళవారం పట్టణంలోని మార్క్స్ భవనంలో జరిగిన పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శుల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి, పంటలకు మద్దతు ధర కల్పించడం, నాణ్యమైన విత్తనాలు అందించడం లేదన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ఉన్న సంపాదన వారికి దోచి పెట్టడమేగాక ప్రశ్నిస్తున్న గొంతుకలకు నొక్కేస్తోందని ఆందోళళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా నిధులు సకాలంలో ఇవ్వకపోగా కోతలు విధిస్తోందని, పది ఎకరాలలోపు అందరికీ చెల్లించాలని డిమాండ్ చేశారు. మహిళలకు రూ.2,500, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళల పింఛన్ల పెంపు నేటికీ అమలుగాక పోవడం శోచనీయమన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యడు ఎం.కృష్ణ, ఉమ్మడి జిల్లా కార్యదర్శి సీహెచ్ రాంచందర్, జిల్లా కార్యదర్శి హన్మంతు, ప్రసాద్, గణేష్, రాజన్న, మస్లమణి పాల్గొన్నారు.


