మరమ్మతుకు ఎదురుచూపులు | - | Sakshi
Sakshi News home page

మరమ్మతుకు ఎదురుచూపులు

Apr 27 2026 8:06 AM | Updated on Apr 27 2026 8:06 AM

త్వరలోనే పూర్తిచేస్తాం..

‘చంద్రగఢ్‌’కు

రూ.6.58 కోట్లు మంజూరు

టెండర్‌ పూర్తయినా

అగ్రిమెంట్‌లో జాప్యం

9 ఏళ్లుగా నిరుపయోగంగా

నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల

చంద్రగఢ్‌ లిఫ్ట్‌లో

తాజాగా కాలిన ప్యానల్‌ బోర్డు

వేసవి నాటికి పనులు పూర్తయ్యేనా?

అమరచింత: దేవరకద్ర నియోజకవర్గంలోనే అతిపెద్ద ఎత్తిపోతల చంద్రగఢ్‌ మరమ్మతుల కారణంగా మరుగునపడింది. ఏళ్లుగా ఆయకట్టుకు సాగునీరు అందించకుండా నిరుపయోగంగా మారిన ఎత్తిపోతల మరమ్మతునకు మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేయించారు. అప్పట్లో మక్తల్‌ పర్యటనకు వచ్చిన నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సమస్యను విన్నవించి నిధులు మంజూరు చేయాలని వేడుకోవడం, ఎనిమిది నెలల కిందట ఆయకట్టు రైతులతో కలిసి మరోమారు వివరించడంతో వెంటనే రూ.6.58 కోట్లు మంజూరు చేయడంతో పాటు ఇందుకు సంబంధించిన జీఓ ప్రతులను సైతం సంబంధిత శాఖ అధికారులకు అందించడంతో టెండర్లు ఆహ్వానించారు. టెండర్‌ ప్రక్రియ 4 నెలల కిందట పూర్తవగా పనులు దక్కించుకున్న కంపెనీ నేటికీ ఒప్పందం కుదుర్చుకోలేదు.

ఇదీ పరిస్థితి..

జూరాల ప్రాజెక్టు నిల్వనీటి ఆధారంగా చంద్రగఢ్‌, బెక్కర్‌పల్లి, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతలను 2005లో రూ.50 కోట్లతో పూర్తి చేశారు. ఒక్కో ఎత్తిపోతల కింద 5 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేవిధంగా పైప్‌లైన్‌ నిర్మించారు. కాని కాంట్రాక్టర్‌ పనులు నాసిరకం చేపట్టడంతో పాటు పథకం నిర్వహణ బాధ్యతలను రైతులకు అప్పగించారు. నాణ్యత లేని పైపులు కావడంతో ఎక్కడికక్కడే పగిలిపోయాయి. గత ప్రభుత్వ హయంలో పైపులు మార్చేందుకు నిధులు మంజూరుకు అనేక పర్యాయలు ప్రతిపాదనలు పంపినా ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. చంద్రగఢ్‌, బెక్కర్‌పల్లి ఎత్తిపోతల పరిధిలో ప్రస్తుతం 2,800 ఎకరాల ఆయకట్టు మాత్రమే సాగవుతోంది.

● నాగిరెడ్డిపల్లి, చంద్రగఢ్‌ ఎత్తిపోతల పథకాల ప్యానల్‌ బోర్డులు కాలిపోవడంతో వీటి స్థానంలో కొత్తవి అమర్చాల్సి ఉంది. అదేవిధంగా ఆయకట్టుకు నీరందించేందుకు ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌ మార్పు, లీకేజీలు సరిచేయడం, చిన్న చిన్న మరమ్మతులతో పాటు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు బిగించాల్సి ఉందని ఆయకట్టు రైతులు మంత్రికి వివరించగా.. వీటి కోసం త్వరితగతిన నిధులు మంజూరు చేయించారు.

ఎత్తిపోతల వారీగా ప్రతిపాదనలు..

● నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకానికి సంబంధించి గ్రావిటీ కెనాల్‌, పైప్‌లైన్‌ మార్పు, చిన్న సంపుహౌజ్‌ల నిర్మాణం, కొత్త ప్యానల్‌ బోర్డు ఏర్పాటుకు రూ.2.52 కోట్ల ప్రతిపాదనలు చేశారు.

● చంద్రగఢ్‌ ఎత్తిపోతల పథకంలో ప్యానల్‌ బోర్డుతో పాటు పైపులైన్‌ మార్చేందుకు రూ.1.93 కోట్లు అవసరమని ప్రతిపాదించారు.

● బెక్కర్‌పల్లి ఎత్తిపోతలకు సంబంధించిన పనుల కోసం రూ.2.13 కోట్లు అవసరమంటూ అప్పట్లోనే ఇరిగేషన్‌శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాదికారులు, ప్రజాప్రతినిధులకు అందించా రు. తాజాగా మంత్రి వాకిటి శ్రీహరికి సైతం విన్న వించడంతో నిధులు మంజూరయ్యాయి.

చంద్రగఢ్‌, బెక్కర్‌పల్లి, నాగి రెడ్డిపల్లి ఎత్తిపోతల పథకాల ఆధునికీకరణకు మంత్రి వాకిటి శ్రీహరి చొరవతో నిధులు మంజూ రయ్యాయి. వీటికి సంబంధించిన టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తయింది. పనులు దక్కించుకున్న కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఇప్ప టి వరకు అగ్రిమెంట్‌ మాత్రం పూర్తి చేయలేదు. త్వరలోనే అగ్రిమెంట్‌ పూర్తిచేసి మరమ్మ తులు చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటాం.

– జగన్మోహన్‌, ఈఈ,

పీజేపీ నందిమళ్ల డివిజన్‌

Advertisement
 
Advertisement
Advertisement