ఉండవెల్లి: మండలంలోని కలుగోట్ల గ్రామస్తులు కొన్ని రోజులుగా కాళ్లు, చేతుల వాపు, కండరాళ్ల బలహీనతతో బాధపడుతున్నారు. సమాచారం అందుకున్న మిషన్ భగీరథ అధికారులు శనివారం గ్రామానికి చేరుకొని తాగునీటి శాంపిల్స్ సేకరించారు. వైద్యసిబ్బందికి ఇంటింటికెళ్లి పరీక్షలు చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కుటుంబీకులు అలంపూర్ చౌరస్తాలోని 100 పడకల ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మరికొందరు కర్నూలులోని ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
ఏఈఓ సస్పెన్షన్
కందనూలు: బిజినేపల్లి మండలం పాలెం క్లస్టర్లో పనిచేస్తున్న వ్యవసాయ విస్తరణాధికారి ఎస్.విష్ణువర్ధన్ను సస్పెన్షన్ చేస్తూ కలెక్టర్ బదావత్ సంతోష్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. రైతుభరోసా పథకం నిధులను దారి మళ్లించినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు ఏఈఓ సస్పెన్షన్లో కొనసాగుతారని పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో సంబంధిత అధికారి తన ప్రధాన కార్యాలయాన్ని వదిలివెళ్లకూడదని తెలిపారు. కాగా, వెల్లగొండకు చెందిన అధికార పార్టీ నాయకుడు ఒకరు ఏఈఓ సస్పెన్షన్ నిలుపుదల చేసేందుకు విఫలయత్నం చేసినట్లు తెలిసింది.


