ఉండవెల్లి: ఆడపిల్లలు పదో తరగతి చదివితే వివాహం చేసి పంపించేవారని, ప్రస్తుతం ఆడపిల్లలే చదువులలో రాణిస్తున్నారని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. గురువారం మండలంలోని పుల్లూరు బాలికల గురుకుల పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్తోపాటు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నుషిత, బీసీ సంక్షేమ శాఖ అధికారి అక్బర్బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఒకప్పుడు ఇంట్లో అమ్మాయి పుట్టిందని చులకనగా చూసిన సమాజం.. ప్రస్తుతం ఆడపిల్లలు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తుంటే ఆడపిల్లలు అద్భుతం అని కొనియాడుతుందని పేర్కొన్నారు. గొప్ప చదువులు చదివి ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకువచ్చి మంచి ఉద్యోగాలు సాధించాలని కోరారు. ఆడపిల్లల చదువే ఇంటికి వెలుగు అని కొనియాడారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి అధికారులు మధ్యాహ్న భోజనం చేశారు. నృత్య ప్రదర్శనలతో విద్యార్థులు అలరించారు. అనంతరం కలుగోట్ల పంచాయతీ, కేజీబీవి పాఠశాలను అధికారులు తనిఖీ చేశారు. పాఠశాల ప్రహరీ త్వరగా పూర్తి చేయించాలని ప్రిన్సిపల్ రాధమ్మకు సూచించారు.


