మల్దకల్: దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం మల్దకల్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి.. పలు రికార్డులను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న భూ సమస్యలు అన్నింటినీ వెంటనే పరిష్కరించాలని అధికారులను సూచించారు. గ్రామాల్లో జీపీఓలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో రైతు సమస్యలను పరిష్కరించేందుకు జీపీఓలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. చిన్నచిన్న సమస్యలతో రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పవద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా జీపీఓలకు ప్రత్యేక గదులు కేటాయించాలని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన సమస్యను ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఝాన్సీరాణి, సీనియర్ అసిస్టెంట్ కరీం, ఆర్ఐ మహేందర్, రవితేజ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


