ప్రజలకు అందుబాటులో వైద్యసేవలు | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు అందుబాటులో వైద్యసేవలు

Apr 20 2026 8:23 AM | Updated on Apr 20 2026 8:23 AM

గద్వాల/కేటీదొడ్డి: ప్రజల ఆరోగ్యానికి ప్రభు త్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 9వ వార్డులో పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం భవన నిర్మాణానికి భూమిచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో బస్తీ దవాఖానా ఏర్పాటుకు ప్రభుత్వం రూ. 14లక్షలు మంజూరు చేసిందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులో ఉంచేందుకు బస్తీ, పల్లె దవాఖానాలను ఏర్పాటు చేస్తోందన్నారు. అత్యవసర సేవలు అందించేందుకు బస్తీ దవాఖానాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. అనంతరం 21, 18 వార్డుల్లో వాటర్‌ ట్యాంకుల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. తాగునీటి సమస్య పరిష్కారానికి అమృత్‌ పథకంలో భాగంగా రూ. 14లక్షలు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జయలక్ష్మి, వైస్‌చైర్మన్‌ శంకర్‌, నాయకులు బాబర్‌, వెంకటమ్మ, వేదావతి, మురళి, రామలింగేశ్వర్‌ కామ్లీ, వెంకటమ్మ, లత, చంద్రశేఖర్‌, సత్యం, మురళి పాల్గొన్నారు.

● కేటీదొడ్డి మండల కేంద్రంలోని సౌడుక్యాంపులో లబ్ధిదారు నర్సమ్మ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. పేదల సొంతింటి కల సాకా రం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం చేపట్టిందన్నారు. నియోజకవర్గంలో ప్రతి పేద కుటంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హనుమంతు, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్‌, సర్పంచ్‌ ఆంజనేయులు, మాజీ వైస్‌ఎంపీపీ విజయ్‌, సర్పంచు నారాయణ, నాయకులు ఉరుకుందు, గోవిందు పాల్గొన్నారు.

అలంపూర్‌ కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న ధాన్యం పరిశీలిస్తున్న ఎమ్మెల్యే విజయుడు

అలంపూర్‌: నియోజకవర్గ రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. పట్టణంలోని పీఏసీఎస్‌, క్యాతూర్‌ పీఏసీఎస్‌లో మార్క్‌ఫెడ్‌ సహకారంతో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర కల్పించడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్‌కు రూ. 2,400 మద్దతు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ధాన్యాన్ని భద్రపర్చుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్రానికి వచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా మద్దతు ధర కల్పించడానికి అధికారులు తగు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నీలి శ్రీనివాసులు, మార్కెట్‌ యార్డు కమిటీ చైర్మన్‌ దొడ్డెప్ప, వైస్‌చైర్మన్‌ పచ్చర్లకుమార్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జయరాముడు, వైస్‌చైర్మన్‌ విక్రమ్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

అలంపూర్‌ పట్టణంలో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే విజయుడు లబ్ధిదారులకు అందజేశారు. అలంపూర్‌ మండలం భీమవరానికి చెందిన జయన్నకు రూ.18 వేలు, పుష్పావతమ్మకు రూ.60 వేల చెక్కును అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement