ఎర్రవల్లి: అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, వీటిపై ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. గురువారం ఎర్రవల్లిలో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని 10 ముఖ్యాంశాలను అజెండాగా తీసుకొని 99 రోజులపాటు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లాస్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించడం జరిగిందని, గ్రామసభలను కూడా పూర్తి చేశామన్నారు. మండల స్థాయి కార్యక్రమాల అనంతరం నియోజకవర్గ స్థాయిలోనూ కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. హెచ్పీవీ టీకాతో సర్వైకల్ క్యాన్సర్ను నివారించవచ్చని, 14–15 ఏళ్లలోపు బాలికలకు వేయించాలని సూచించారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు రాని వారికి రెండో విడతలో మంజూరు చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సర్పంచులు తమ పరిధిలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు. రైతులు ఆయిల్పాం పంటలు సాగు చేస్తే లాభసాటిగా ఉంటుందని, యూరియా వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులపై దృష్టిసారించాలని కోరారు. అరైవ్– అలైవ్ వారోత్సవాల్లో రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని, వాహనదారులు నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలన్నారు. అనంతరం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులకు సామూహిక సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన చేశారు. అలాగే పలు గ్రామాల సర్పంచులు, ప్రజలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి నుషిత, హెచ్ఓ ఇమ్రానా, తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ మహేష్, సీఐ ప్రదీప్కుమార్, ఏఓ సురేష్గౌడ్, ఎస్ఐ తరుణ్కుమార్రెడ్డి, సర్పంచ్ అనిత తదితరులు పాల్గొన్నారు.


