రాజోళి: మండలంలోని మాన్దొడ్డి, పచ్చర్ల గ్రామాల్లో అడిషనల్ హెల్త్ డైరెక్టర్ అమర్సింగ్ శనివారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడారు. గ్రామంలో హెచ్పీసీవీ, కిడ్నీ సంబంధిత వ్యాధులు, పక్షవాతం వ్యాధుల బారినపడిన వారి వివరాలు సేకరించారు. గ్రామంలో ఎంతమందికి ఇలాంటి వ్యాధులు ఉన్నాయి.. గతంలో ఎవరెవరికి వచ్చి.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. వారు ప్రస్తుతం చికిత్స ఎక్కడ తీసుకుంటున్నారని ఆరాతీశారు. స్థానిక వైద్య సిబ్బందితో మాట్లాడి సూచనలు చేశారు. వ్యాధులకు సంబంధించి ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, వైద్యం అందిస్తున్న తీరును అడిగారు. వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై చర్చించారు. గ్రామాల్లో ప్రజలకు రక్త పరీక్షలు నిర్వహించాలని, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి, వారికి ఉన్న ఆరోగ్య సమస్యలకు తగిన వైద్యం చేసి మందులు అందించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, ఉప సర్పంచ్ భీమన్న, జిల్లా కోఆర్డినేటర్ శ్యాంసుందర్, రామకృష్ణ, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.


