
ఆకలి బాధ తీరేనా?
జూనియర్ కళాశాలల్లో అమలుకు నోచుకోని మధ్యాహ్న భోజన పథకం
● ఉత్తమాటగా మారిన ప్రభుత్వ ప్రకటన
● ఈ ఏడాదైనా అమలు చేయాలని వేడుకోలు
వెంటనే అమలు చేయాలి..
మాది కేటీదొడ్డి మండలం పాతపాలెం గ్రామం. 15 కి.మీ. దూరంలో ఉన్న ధరూర్ కళాశాలకు ఉదయం 8 గంటలకే ఇంటి నుంచి కళాశాలకు బయల్దేరాల్సి వస్తోంది. ఉదయం సరిగ్గా తినాలనిపించదు. కొన్నిసార్లు వీలుపడక టిఫిన్ బాక్సులు తెచ్చుకోవడం లేదు. ఇంటికి వెళ్లే వరకు ఆకలికి తట్టుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం తెచ్చిన ప్రతిపాదననను అమలుచేస్తే ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. – సురేశ్, ఇంటర్ విద్యార్థి
ఎంతో మేలు చేసినట్లవుతుంది
జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు ద్వారా పేద, గ్రామీణ విద్యార్థులకు ఎంతో మేలు చేసిన వారవుతారు. ఉదయం కాలేజీకి వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్లే వరకు భోజనం లేకుండా ఉండటం వల్ల చదువుపై కూడా దృష్టి సారించలేకపోతున్నాం. మాది గట్టు మండలం ఆలూరు గ్రామం. బస్సులు కూడా సమయానికి లేకపోవడంతో త్వరగా బయల్దేరాల్సి వస్తోంది.
– శ్రావణి, ఇంటర్ విద్యార్థిని
●
గద్వాలటౌన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ఆకలి బాధ తప్పడం లేదు. ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుచేస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఉత్తమాటగానే మారింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకుంటున్న వారిలో ఎక్కువ శాతం పేద, మధ్యతరగతి కు టుంబాలకు చెందిన విద్యార్థులే ఉన్నారు. వీరిలో 80 శాతం మంది ఇతర గ్రామాల నుంచి కళాశాలలకు వస్తున్నారు. చాలా మంది విద్యార్థులకు ఇంటి నుంచి భోజనం తెచ్చుకునే పరిస్థితి లేకుండా పోవడంతో రోజంతా పస్తులతో ఉంటున్నారు. ఈ సమస్యను గమనించిన ప్రభుత్వం.. జూనియర్ కళాశాలల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని ప్రతిపాదన ముందుకు తెచ్చింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. అయితే ప్రతి ఏడాది ఇప్పుడు, అప్పుడు అంటూ కాలం గడుస్తోంది. ఈ విద్యా సంవత్సరంలోనూ ఆ ఊసే లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ఖాళీ కడుపులతోనే..
జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల మాదిరిగా జూనియర్ కళాశాలలు అందుబాటులో లేవు. జిల్లా కేంద్రం లేదా మండల కేంద్రాల్లో ఏదో ఒకచోట ఉన్నాయి. దీంతో గ్రామీణ విద్యార్థులు 15 నుంచి 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కళాశాలలకు వస్తున్నారు. ఉదయం 9 గంటలకల్లా కళాశాలకు చేరుకోవాలంటే ఇంటి నుంచి 7 గంటలకే బయల్దేరాలి. ఈ నేపథ్యంలో ఇంట్లో వారు వేకువజామునే లేచి వంట చేయాలి. అయితే కళాశాలకు వచ్చే విద్యార్థుల్లో ఎక్కువ మంది రైతులు, కూలీల పిల్లలే ఉన్నారు. దీంతో వారు తల్లిదండ్రుల ఇబ్బందులను అర్థం చేసుకొని ఉన్నంతలో సర్దుకొని భోజనం తెచ్చుకుంటున్నారు. కొన్నిసార్లు తెచ్చుకునే వీలుకాక ఖాళీ కడుపులతోనే తరగతుల్లో కూర్చుంటున్నారు. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
అమలు చేస్తే మెరుగైన ఫలితాలు..
మధ్యాహ్న భోజనం తెచ్చుకోని కొందరు విద్యార్థులు ఉదయం తరగతులకు హాజరై.. మధ్యాహ్నం ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించినట్లు కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలైతే విద్యార్థుల హాజరు శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కళాశాలల్లో ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏ ర్పాటు చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలైతే విద్యార్థులు పూర్తిస్థాయిలో హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అధ్యాపకులు చెబుతున్నారు.
ఉత్తర్వులు అందలేదు..
ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుచేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించింది. ఈ విద్యా సంవత్సరంలో భోజన పథకంపై ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పథకం అమలైతే గ్రామీణ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. – హృదయరాజు, డీఐఈఓ
విద్యార్థుల
సంఖ్య
3,862
జిల్లాలో ప్రభుత్వ
జూనియర్ కళాశాలలు
08

ఆకలి బాధ తీరేనా?

ఆకలి బాధ తీరేనా?

ఆకలి బాధ తీరేనా?