
ఆస్తి కొట్టు
ఫోర్జరీ పెట్టు..
జిల్లాలో రెచ్చిపోతున్న కేటుగాళ్లు
●
చర్యలు తీసుకోవాలి
నా స్వగ్రామం పచ్చర్ల. అయితే జీవనోపాధి కోసం నేను, భార్యపిల్లలు ధర్మవరంలో ఉంటున్నాం. గ్రామంలో మా నాన్న నాకు పంచిన వాటాను నా తమ్ముడు ఆంజనేయులు వాటాగా చూపి, గ్రామ పంచాయతీ సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి నా వాటాను ఇతరులకు అమ్మేశాడు. ఇంటినే కాదు, వ్యవసాయ భూమిని కూడా అమ్మేశారేమోనని అనుమానంగా ఉంది. దీని వల్ల అన్నదమ్ములకు తగదాలు ఏర్పడుతున్నాయి. ఫోర్జరీ చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి.
– తామేష్ గౌడ్, పచ్చర్ల
(అసలైన ఇంటి వాటాదారుడు,బాధితుడు)
రాజోళి: జిల్లాలో కొందరు కేటుగాళ్లు నయా దందాకు తెరలేపారు. ఇళ్లు, స్థలం, భూమి ఇలా దేనినైనా విక్రయించాలంటే కుటుంబసభ్యులు (ఆస్తిలో వాటాదారులు) అందరి సంతకాలు ఉండాలి. కొన్ని సందర్భాల్లో యాజమాన్య ధ్రువీకరణ పత్రం, పన్ను రశీదులతో కూడా ఒకరి నుంచి మరొకరికి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. ఇందులోని కొన్ని లొసుగులను ఆధారంగా చేసుకొని పంచాయతీ సెక్రటరీల సంతకాలు ఫోర్జరీ చేసి.. వాటి ఆధారంగా యాజమాన్య ధ్రువీకరణ పత్రం పొందుతున్నారు కేటుగాళ్లు. అటు పంచాయతీ సెక్రటరీ సంతకం.. ఇటు కుటుంబసభ్యుల్లో మిగతా వారి సంతకాలు ఇలా మొత్తం ఫోర్జరీ చేసి ఒకరిపై రిజిస్ట్రేషన్ చేసి అందినకాడికి డబ్బులు వెనకేసుకుంటున్నారు. రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ములు ఒకరిపై మరొకరు దాడులకు దిగేలా పరిస్థితులు మారుస్తున్నారు. జిల్లాలో ఇటీవల ఇలాంటి ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
బయటకు వచ్చిన వాటిలో..
జిల్లాలోని గట్టు మండలం తప్పెట్లమొర్సులో ఒక వ్యక్తి ఇంటిని గ్రామ పంచాయతీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేయించారు. రాజోళి మండలం పచ్చర్ల గ్రామంలో కూడా 2021లో గ్రామ పంచాయతీ సంతకం ఫోర్జరీ చేసి అన్నకు చెందిన ఆస్తిని తమ్ముడికి రిజిస్ట్రేషన్ చేయించారు. దీని వివరాలను ‘సాక్షి’ ఆరా తీయగా.. పచ్చర్ల గ్రామానికి చెందిన ఖాసీంగౌడ్కు ముగ్గురు కుమారులు కాగా.. తన ఇంటిని ముగ్గురికి వాటాలు పంచాడు. పెద్ద కుమారుడైన తామేష్గౌడ్ జీవనోపాధి కోసం ఇటిక్యాల మండలం ధర్మవరానికి వెళ్లి అక్కడే జీవిస్తున్నాడు. ఈ క్రమంలో తన తమ్ముడైన అంజనేయులుగౌడ్ పేరుపైన 10–05–2021లో యాజమాన్య ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తూ గ్రామ పంచాయతీ సెక్రటరీ సంతకంతో(ఫోర్జరీ) ధ్రువీకరణ పత్రాన్ని చూపించి, అదే గ్రామానికి చెందిన ఉరుకుందమ్మకు జనవరి 21–2025 నాడు అమ్మకం చేశారు. ఇంటిలో అసలు వాటాదారుడైన తామేష్ గౌడ్కు ఇప్పుడు విషయం తెలిశాక అసలు మోసం వెలుగు చూసింది. అయితే ఇందులో సాక్షులుగా ఉన్న కుర్వ హుస్సేన్కు సంతకం రాదని, వేలి ముద్రనేని, కాని ఆయన సంతకం కూడా ఫోర్జరీ చేసి అమ్మకాలు చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. ఆస్తిని వాటాలు చేసిన ఖాసీంగౌడ్కు కూడా సంతకం చేయడానికి రాదని, ఆయన కూడా వేలి ముద్రేనని గ్రామస్తులు అంటున్నారు. ఈ ప్రక్రియలో మొత్తం ఒక వ్యక్తి ఫోర్జరీ సంతకాలు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇవే కాక జిల్లాలో చాలా గ్రామ పంచాయతీ సెక్రటరీల సంతకాలను ఫోర్జరీ చేసి ఇదే విధంగా ఒకరికి తెలియకుండా మరొకరికి ఆస్తులను ఫోర్జరీ సంతకాలతో చేస్తున్నా వారిపై అధికారులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో తెలియడం లేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
అధికారులు ఏమన్నారంటే..
2021 సంవత్సరంలో జారీ చేసిన ఈ ధ్రువీకరణ పత్రంపై అప్పటి పంచాయతీ సెక్రటరీలను ‘సాక్షి’ వివరణ కోరింది. 2021లో ఉన్న ధనుంజయరెడ్డి దీనిపై మాట్లాడుతూ.. పచ్చర్లలో తాను ఎలాంటి ధ్రువీకరణ పత్రం ఎవ్వరికీ ఇవ్వలేదని తెలిపారు. జనార్ధన్తో మాట్లాడగా.. తాను ఇప్పటిదాకా ఎవరికీ యాజమాన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేదని, అసలు ఆ పత్రంలో ఉన్నది పంచాయతీ సెక్రటరీల సంతకాలే కాదని, అది ఫోర్జరీనే అని తెలుస్తుందని తెలిపారు.
గ్రామ పంచాయతీ సెక్రటరీ
సంతకాలు ఫోర్జరీ
గద్వాల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తమ పేరుపైకి ఆస్తి మార్పిడి
తాజాగా వెలుగు చూసిన
ఘటనలు
ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే..
ఎప్పటి నుండో గ్రామాల్లో ఉంటున్న తమ ఇళ్లను తమ పిల్లల పేరు మీద చేయించేందుకు ఒక ప్రక్రియ ఉంటుంది. అయితే కొందరు తమ పిల్లలకు ఉన్న ఇంటిని బాగాలు చేసి అందులో నివాసం ఉండేలా ఏర్పాటు చేస్తారు. దాన్ని క్రమంగా గ్రామ పంచాయతీలో పన్నులు చెల్లిస్తూ తమ పేరును క్రమబద్ధీకరించుకుంటారు. అదే క్రమంలో మరి కొందరు నేరుగా తమ పేరు మీదకే రిజిష్ట్రేషన్ చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. దాని కోసం ఎవరైతే గత కొంత కాలంగా గ్రామ పంచాయతీలో పన్నులు చెల్లిస్తున్నారో.. వారు యాజమాన్య ధ్రువీకరణ పత్రం, పన్ను రశీదులు తీసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేసుకుంటారు. ఇదే అదునుగా కొందరు దళారులు, పైరవీకారులు రెచ్చిపోయి డబ్బు పోగేసుకునేందుకు నానా రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. గ్రామ పంచాయతీ సెక్రటరీల సంతకాలను ఫోర్జరీ చేసి యాజమాన్య ధ్రువీకరణ పత్రం సృష్టించి దాని సాకుగా గద్వాల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఒకరి బాగానికి వచ్చిన ఆస్తిని వారికి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయడంతో అసలు యజమానులు తాము ఎప్పుడు తమ ఇంటిని అమ్ముకున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా అన్నదమ్ముల మధ్య ఇలాంటివి జరగడంతో వారు కేసులని కోర్టులని వారి మధ్య తగాదాలు పెంచుకుని అవి ఘర్షణలకు దారి తీస్తున్నాయి.

ఆస్తి కొట్టు

ఆస్తి కొట్టు

ఆస్తి కొట్టు