
ఉత్సాహంగా ఒలింపిక్ రన్
గద్వాలటౌన్: జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో సోమవారం ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రన్ ఎంతో ఉత్సాహంగా సాగింది. ఆయా పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు, క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఈ పరుగులో పాల్గొన్నారు. జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం, జిల్లా ఒలింపిక్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి జితేందర్ హాజరయ్యారు. క్రీడాజ్యోతిని వెలిగించి పరుగును ప్రారంభించారు. కాసేపు క్రీడాకారులతో కలిసి పరిగెత్తి వారిలో ఉత్సాహాన్ని నింపారు. పట్టణ ప్రధాన రహదారుల వెంట ఒలింపిక్ పరుగు సాగింది. జిల్లా కేంద్రంలో ఉదయం క్రీడాకారులు, చిన్నారుల సందడితో రహదారులు కిక్కిరిసాయి. జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ చాటిన క్రీడాకారులు ఒలింపిక్ కాగడా పట్టుకుని పరుగులో పాల్గొన్నారు. క్రీడాకారులనుద్దేశించి డీవైఎస్ఓ జితేందర్ మాట్లాడుతూ.. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు జరిగిన కాలంలో విశ్వశాంతి, స్నే హహస్తం కోసం క్రీడలు ఎంతో దోహదపడతాయని భావించిన ప్రజలు ఆనాడు క్రీడా జ్యోతితో ఒలింపిక్ పరుగును ప్రారంభించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలలో ప్రతిభ, నైపుణ్యం ఉన్నవారిని ప్రోత్సహించి నజరానా అందిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ఒలింపిక్ డే ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కరాటే మాస్టర్ శ్రీహరి, విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్ ప్రభాకర్, పీఈటీలు బీసన్న, రజనికాంత్, విజయ్ క్రికెట్ కోచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు.