
ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
ధరూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి సొంత గృహం కల్పించాలనే సదుద్ధేశంలో ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని అమలు చేస్తోందని, ఇందులో భాగంగానే నియోజకవర్గానికి 3,500 ఇళ్లు, అందులో ధరూరు మండలానికి 830 మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇళ్ల నిర్మాణ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ పద్దతుల్లో జరుగుతోందని, నిరాఇ్మణం ప్రారంభం నుంచి లబ్ధిదారుల స్థలాలను గూగుల్ మ్యాప్, ఫొటోలు, రికార్డుల ఆధారంగా దశల వారీగా బిల్లులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. గతంలో మండలంలో 10వ తరగతికే పరిమితం కాగా.. నేడు ఇంటర్, డిగ్రీ ఇక్కడే చదువుకునే అవకాశం కల్పించి విద్యార్థులకు సమస్య లేకుండా చేశామని, పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతులను కల్పించి సమస్యలు లేకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండారి భాస్కర్, ఎంపీడీ మంజుల, నాయకులు జంబు రామన్ గౌడ్, వెంకట్రామిరెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్రెడ్డి, రఘువర్ధన్రెడ్డి పాల్గొన్నారు.