
అమరవీరుల త్యాగాలు మరువలేనివి
గద్వాల క్రైం/అలంపూర్/ఎర్రవల్లి: ఎందరో అమరవీరుల త్యాగఫలం వలనే మనమంతా ఈరోజు స్వతంత్రంగా జీవిస్తున్నామని.. అలాంటి అమరవీరుల త్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రముఖులు పిలుపునిచ్చారు. అలంపూర్ చౌరస్తాలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఎమ్మెల్యే విజయుడు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సాధన కోసం ప్రజలు అనేక పోరాటాలు చేశారని, నాలుగు దశాబ్దాల పోరాటంలో ఎందరో మహనీయులు ప్రాణాత్యాగాలు చేశారన్నారు. అలాగే, జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం వద్ద ఎస్పీ శ్రీనివాసరావు జాతీయ జెండా ఎగురవేశారు. ఎన్నో పోరాటాలు, ఎందరో విద్యార్థులు, ఉద్యమకారులు, ఆత్మబలిదానాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని, వారి ఆంక్షలను బావితరాలకు అందించాల్సిన ఆవశ్యకత మన అందరిపై ఉందని ఎస్పీ అన్నారు. అదేవిధంగా, ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి పదో బెటాలియన్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఇన్చార్జ్ కమాండెంట్ జయరాజు జాతీయ జెండాను ఎగుర వేశారు.