
ధాన్యం తరలించాలంటూ నిరసన
అయిజ: మండలంలోని పులికల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలో సరిపడినన్ని లారీలు రాకపోవడంతో ధాన్యం నిలువలు పేరుకపోయాయని, వర్షం వస్తే ధాన్యం తడిసిపోతుందని రైతులు సోమవారం నిరసన తెలిపారు. ఒక రైతు లారీ టైరు కింద పడుకొని నిరసన తెలిపారు. ప్రతి రోజు 10 లారీలు రావాల్సి ఉండగా మూడు రోజులనుంచి 3 నుంచి 5 లారీలు మాత్రమే వస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలు పడుతున్న కారణంగా ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం రాశుల్లో, బస్తాల్లో తడిసిపోయి నాణ్యత లేకుండా పోతుందని రైతులు వాపోయారు. ఈవిషయంపై ఐకేపీ ఏపీఎం, అన్నపూర్ణ, సీసీ జయన్నను వివరణ కోరగా లారీల కొరత ఏర్పడిందని, త్వరలో ధాన్యం తరలిస్తామని తెలిపారు.