
మతోన్మాద విధానాలపై సమరశీల పోరాటాలు
కల్వకుర్తి రూరల్: దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు అబ్బాస్ అన్నారు. మంగళవారం కల్వకుర్తిలోని యూటీఎఫ్ భవనంలో నిర్వహించిన సీపీఎం జిల్లా రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు నిర్వహిస్తామన్నారు. మతం పేరుతో రాజకీయ లబ్ధి పొందడమే కాకుండా ప్రజా సమస్యలను తీర్చకుండా దేశాన్ని బడా కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. దేశాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నడుపుతున్నారా లేక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిపాలిస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. పాకిస్తాన్, భారత్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు పదే పదే ప్రకటిస్తున్న దేశ ప్రధాని ఆ మాటలను ఖండించకపోవడం ఆక్షేపణీయమన్నారు. పాకిస్తాన్ మతోన్మాద చర్యలను అణచివేసేందుకు అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపిన అమెరికా అధ్యక్షుడి ఆదేశాలతో యుద్ధం ముగించడం దుర్మార్గమన్నారు. ఉగ్రవాదుల చేతిలో మరణించిన కుటుంబాలను పరామర్శించే సమయం లేని ప్రధానమంత్రి ఎన్నికలు జరిగే బీహార్లో మాత్రం సుడిగాలి పర్యటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికలపై ఉన్న ప్రేమ ప్రధానికి దేశ ప్రజలపై లేదని ఆయన విధానాల వల్లే అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు, కార్యదర్శివర్గ సభ్యుడు ఆంజనేయులు, శ్రీనివాస్, మల్లయ్య, పరశురాములు, బాలస్వామి, శ్రీనివాస్ పాల్గొన్నారు.