
‘నెట్టెంపాడు’ భూసేకరణ వేగవంతం చేయాలి
గద్వాల: జవహార్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, అదేవిధంగా పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి రవినాయక్, కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నెట్టెంపాడు ప్రాజెక్టు కింద పెండింగ్లో ఉన్న 480ఎకరాల భూసేకరణపై వెంటనే చర్యలు తీసుకుని భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రధానంగా 99,100 ప్యాకేజీలలో సేకరించాల్సిన భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, చింతరేవుల, శెట్టిఆత్మకూరు, మెలచెర్వు గ్రామాల్లో భూసేకరణపై రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్స్, కెనాల్స్, వారిగా తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్, ఇరిగేషన్ అధికారులతో కూడిన ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని,భూసేకరణ పరిహారం చెల్లించిన వెంటనే అవసరమైన సివిల్ పనులు ప్రారంభించాలన్నారు. కాల్వల నిర్మాణం వల్ల గ్రామాల అభివృద్ధి, సాగు సౌకర్యాలు మెరుగవుతాయని, త్వరలోనే ప్రాజెక్టు పనులను పరిశీలిస్తానని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో శ్రీనివాసరావు, ఎస్ఈ రహీముద్దీన్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.