
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
గద్వాలటౌన్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా వెనుకబడిన జాతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ 134వ జయంతి ఉత్సవాలను కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆనాడు మహనీయుడు అంబేద్కర్కు కనీస అవసరాలు లేకున్నా ఉన్నత చదువులు చదివి భావి భారత తరాలకు ఉపయోగపడేలా రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు. ఆయన కృషితోనే మనం రిజర్వేషన్లు, ఉద్యోగాలు అనుభవిస్తున్నామన్నారు. మహనీయుల ఆశయాలు విద్య ద్వారానే సాకారం చేయవచ్చన్నారు. వారి ఆశయాలను సాధించాల్సిన బాధ్యత ముఖ్యంగా యువత, విద్యార్థులపై ఉందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, ఏఓ నరేందర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్బాబు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిణి సరోజ తదితరులు పాల్గొన్నారు.
● ఎర్రవల్లి: భారత రాజ్యాంగ వ్యవస్థకు రూపకల్పన చేయడంతోపాటు విలువలకు, చట్టబద్దమైన పాలనకోసం ఎంతో కష్టపడి బీఆర్ అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించారని పదో బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య అన్నారు. ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి పదో బెటాలియన్లో అంబేద్కర్ జయంతిని నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంటరానితనంపై అనేక ఉద్యమాలు చేయడంతో పాటు వ్యవస్థలో ఉన్న రుగ్మతకు వ్యతిరేకంగా పోరాడి ఎన్నో మార్పులను తీసుసుకువచ్చిన మహనీయుడు అంబేడ్కర్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడిచి ఆయన ఆశయాలను కొనసాగించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ పాణి, ఆర్ఐలు రాజు, రాజారావు, పటాలం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
● గద్వాల క్రైం: రాజ్యాంగ నిర్మాతగా, న్యాయవాదిగా, వెనకబడిన కులాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాలులర్పించారు. నిరక్షరాస్యత, అంటారానితనం, పేదరికం రూపుమాపడంలో ఆయన ఎంతో కృషి చేశారన్నారు. అదే విధంగా గద్వాల రవాణాశాఖ, అగ్నిమాపక, ఎకై ్సజ్, వైద్యశాఖ ఆర్టీసీ తదితర ప్రభుత్వ కార్యాలయంలో చిత్రపటానికి పూల మాలలు వేసి నివాలులర్పించారు.

అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి