గద్వాలటౌన్: సంస్థానాధీశుల కాలం నాటి పురాతన బావి కబ్జాపై ఎమ్మెల్యే స్పందించాలని సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మోహన్రావు, తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర నాయకుడు ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం కబ్జాకు గురైన పురాతన బావిని వివిధ ప్రజా సంఘాల నాయకులు పరిశీలించారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. చరిత్రాత్మకమైన పురాతన బావి అన్యాక్రాంతమవుతున్న అధికార యంత్రాంగం, ఎమ్మెల్యే స్పందించకపోవడం దారుణమన్నారు. పురాతన కొత్తబావిని ఆక్రమించుకున్న మున్సిపల్ మాజీ చైర్మన్ వేణుగోపాల్పై చర్యలు తీసుకోవడానికి అధికారులు మీనమేశాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. కబ్జాకు గురైన బావిని తక్షణమే పునరుద్దరించి, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పురాతన బావిని పునరుద్దరించకపోతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. బావి పరిరక్షణ కోసం ప్రజా ఉద్యమాన్ని చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కుర్వ పల్లయ్య, ఉప్పేర్ సుభాన్, వాల్మీకి, కృష్ణ, నాగన్న తదితరులు పాల్గొన్నారు.
యువత క్రీడల్లో
నైపుణ్యం పెంచుకోవాలి
పెద్దకొత్తపల్లి: గ్రామీణ యువత క్రీడల్లో నైపుణ్యం పెంపొందించుకొని జాతీయస్థాయిలో రాణించాలని ఎకై ్సజ్, క్రీడాశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దకొత్తపల్లి మండలం వావిళ్లబావి గ్రామంలో ఆదివారం జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ యువతలో కబడ్డీ నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ పోటీలు ఎంతో దోహదపడతాయన్నారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించి.. క్రీడాస్ఫూర్తిని చాటాలని క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్గౌడ్, వెంకటేశ్వర్రావు, దండు నర్సింహ, మైసమ్మ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, సింగిల్విండో మాజీ చైర్మన్ బాలస్వామి, సుధాకర్ పాల్గొన్నారు.
రామలింగేశ్వరస్వామికి విశేషాలంకరణ
అడ్డాకుల: మండలంలోని కందూర్ సమీపంలో స్వయంభూగా వెలసిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో శివలింగానికి ఆదివారం విశేషాలంకరణ చేశారు. అర్చకులు వివిధ రకాల పూలతో గర్భగుడిని, శివలింగాన్ని శోభాయమానంగా అలంకరించి పూజలు చేశారు. ఉగాది పండుగ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన ఆలయంలోని శివలింగాన్ని దర్శించుకున్న భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించారు. తర్వాత ఆలయ ఆవరణలో ఉన్న కల్పవృక్షం చుట్టు ప్రదక్షిణలు చేశారు. ఆలయం బయట ఉన్న దుకాణాల వద్ద రద్దీ కనిపించింది.
ఆయిల్పాం ఫ్యాక్టరీ పనులు అడ్డుకున్న గ్రామస్తులు
కొత్తకోట రూరల్: మండలంలోని సంకిరెడ్డిపల్లి శివారులో ఆయిల్పాం ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఇటీవల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ హయాంలోనూ మాజీ మంత్రి కేటీఆర్ సైతం మాజీ మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. కాగా.. ఆదివారం ఉగాది రోజన ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు యాజమాన్యం యంత్రాలతో రాగా, గ్రామస్తులు ఒక్కసారిగా అక్కడకు చేరుకొని అడ్డుకున్నారు. ఎస్ఐ ఆనంద్ సిబ్బందితో అక్కడకు చేరుకొని నచ్చజెప్పారు.
పురాతన బావి కబ్జాపై స్పందించాలి
పురాతన బావి కబ్జాపై స్పందించాలి