వెలికితీస్తే వెలుగులెన్నో | - | Sakshi
Sakshi News home page

వెలికితీస్తే వెలుగులెన్నో

Jun 27 2025 4:51 AM | Updated on Jun 27 2025 4:51 AM

వెలిక

వెలికితీస్తే వెలుగులెన్నో

1980వ దశకంలో మొదటిసారి రైతుపొలంలో నల్లబంగారం

1992–94లో ఓఎన్‌జీసీ, సింగరేణి సంయుక్త పరిశోధనలు

నక్సలైట్లు యంత్రాలను కాల్చడంతో ఆగిన ప్రయత్నాలు

2018లో పొలంలో బోరు వేయడంతో మరోసారి బయటపడిన బొగ్గు

సింగరేణి సంస్థ వెలికి తీస్తే ఉపాధి, అభివృద్ధి

చండ్రుపల్లిలో

బోరు వేస్తుండగా

బయటకు వచ్చిన

నల్లని చూర (ఫైల్‌)

కాళేశ్వరం: అపారమైన సహజ సంపదకు కేరాఫ్‌ మహదేవపూర్‌ ప్రాంతం. ఒకప్పుడు టేకు కలప విరివిగా దొరికేది. ప్రస్తుతం ఇసుకతో ప్రభుత్వానికి నిత్యం ఆదాయం వస్తోంది. ఈ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలను సైతం వెలికితీస్తే యువతకు ఉపాధి అవకాశాలతో పాటు ఈప్రాంతమంతా అభివృద్ధితో పోటీ పడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఈప్రాంతం ప్రపంచ స్థాయి గుర్తింపునకు చేరింది. కాగా, మహదేవపూర్‌ మండలం చండ్రుపల్లి పరిసర ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలు విరివిగా ఉన్నట్లు పరిశోధనలతో తేలింది. సంబంధిత సంస్థలు బొగ్గు వెలికితీత, సర్వేలు చేపడితే భవిష్యత్‌లో మహదేవపూర్‌ సహజ ఖనిజ సంపదకు చిరునామాగా నిలవనుంది. కానీ.. సింగరేణి ఇక్కడి కొత్త ప్రాజెక్టులపై దృష్టిసారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మొదటిసారి ఆనవాళ్లు..

1980–81లో చండ్రుపల్లిలో గోమాస మల్లయ్య అనే రైతు తన పొలంలో వ్యవసాయం కోసం బావిని తవ్వాడు. అప్పుడు కాళేశ్వరం పరిధి కన్నెపల్లి గ్రామానికి చెందిన ఓ బోరింగ్‌ నిర్వాహకుడు అప్పుడు ఆవిషయాన్ని ఆగ్రామస్తులెవ్వరికీ చెప్పలేదు. చెబితే గ్రామాన్ని ఖాళీ చేయిస్తారని భయపడ్డాడు. ఆతర్వాత 1986లో బావి తవ్వకంలో బొగ్గు ఆనవాళ్లు బయటపడ్డాయని బోరింగ్‌ నిర్వాహకుడు మండల ప్రజలతో చెప్పడంతో ఆవిషయం బయటకు పొక్కింది.

అప్పుడు.. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వమే..

2004లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రి వర్గంలో గడ్డం వినోద్‌ కార్మికశాఖ మంత్రిగా ఇక్కడ బొగ్గు వెలికితీసే ప్రయత్నాలు చేశారు. మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, కార్మికశాఖ మంత్రులుగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గడ్డం వివేక్‌ ఉండడంతో పాటు ఎంపీగా గడ్డం వంశీకృష్ణ ఉన్నారు. ఈప్రాంతంలో బొగ్గు గనులు ఏర్పాటు చేస్తే ఇక్కడి యువతకు ఉపాధి దొరుకుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అసెంబ్లీ, పార్లమెంట్‌లో గళం విప్పి బొగ్గు వెలికితీయాలని, ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టిసారించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.

నా పొలంలో బొగ్గు పడింది..

నాకు చండ్రుపల్లిలో ఐదెకరాల పొలం ఉంది. 2018లో బోరు వేయించాను. నల్లని బొగ్గు బిల్లలతో 35–40 ఫీట్ల నుంచి బయటకు వచ్చింది. బొగ్గు పడిందని మొదట భయమైంది. 250 ఫీట్ల నుంచి నీళ్లు పడ్డాయి. మాఊళ్లో ఎవరు బోరు వేసినా నల్లని బిళ్లలు పడుతున్నాయి. అధికారులు సర్వే చేపడితే యువతకు ఉపాధి దొరుకుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. నేను బోరు వేసిన మరుసటి రోజు సింగరేణి రామగుండం సర్వే డిపార్ట్‌మెంట్‌ వాళ్లు సర్వే చేసి వెళ్లారు. కానీ.. ఇప్పటికి ఎలాంటి పరిశోధనలు చేయలేదు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో సర్వేపై ఆశలు ఉన్నాయి.

– జాడి సురేందర్‌, చంద్రుపల్లి, రైతు

నక్సలైట్ల హెచ్చరికలు..

సీనియర్‌ జియాలజిస్ట్‌ కోనప్ప ఆధ్వర్యంలో 1992–94లో ఓఎన్‌జీసీ(ఆయిల్‌ నేచర్‌ గ్యాస్‌ సంస్థ) బొగ్గు ఉన్నట్లు పరిశోధన చేసి కనిపెట్టారు. గ్రేడ్‌ బి, సీ బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు ధ్రువీకరించారు. సింగరేణి సంస్థ కూడా చండ్రుపల్లి, నాగేపల్లి, అన్నారం, సస్తూర్‌పల్లి, తాడిచర్ల ప్రాంతాల్లో బొగ్గు కోసం పలు భారీ వాహనాలతో అన్వేషిస్తూ పరిశోధనలు జరిపింది. మల్హర్‌ మండలం తాడిచర్లలో కూడా బొగ్గు ఉన్నట్లు అదే సమయంలో కనుగొన్నారు. మహదేవపూర్‌–1, చండ్రుపల్లి బ్లాకులుగా బొగ్గు గురించి అన్వేషణ చేశారు. అప్పుడే పలిమెల మండలంలోని లెంకలగడ్డ, సర్వాయిపేటలో కూడా బొగ్గు గురించి సర్వే చేశారు. ఆ సమయంలో మహదేవపూర్‌ ప్రాంతంలో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. అభయారణ్యం కావడంతో పోలీసులు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాగా.. చండ్రుపల్లి శివారులో ఉన్న సింగేణి సంస్థ భారీ యంత్రాలు, డ్రిల్లింగ్‌ మిషన్లను నక్సలైట్లు కాల్చివేశారు. బొగ్గు నిక్షేపాల వెలికితీతను నిలిపివేయాలని హెచ్చరించారు. దీంతో ఆసంస్థలు పరిశోధనలు నిలిపాయి. సర్వే అధికారులు వెనుదిరిగి వెళ్లారు. అర్ధంతరంగా నిక్షేపాల వెలికితీతను నిలిపివేశారు. అనంతరం అప్పటి నుంచి ఇప్పటి వరకు బొగ్గు వెలికితీతపై సింగరేణి, ఆయా ప్రభుత్వాలు దృష్టి సారించలేదు.

రైతు పొలంలో బొగ్గు

గోదావరి తీర ప్రాంతమైన చండ్రుపల్లిలో 2018లో అదే గ్రామానికి చెందిన రైతు జాడి సురేందర్‌ పొలంలో బోరు వేయించాడు. 40 ఫీట్ల లోతుకు వెళ్లగానే నల్ల రంగులో బొగ్గు రూపంలో బిల్లలు బయటకు వచ్చాయి. బోరు ప్రాంతమంతా బొగ్గు వాసన వచ్చింది. దీంతో రైతులకు బొగ్గు కనబడడంతో అవాక్కయ్యాడు. అప్పట్లో ఆ విషయం మండలంలో చర్చనీయాంశం.

వెలికితీస్తే వెలుగులెన్నో1
1/1

వెలికితీస్తే వెలుగులెన్నో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement