
భద్రకాళి అమ్మవారికి సహస్ర కలశాభిషేకం
శాకంబరీ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అమ్మవారి అలంకరణ
హన్మకొండ కల్చరల్: వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళి దేవాలయంలో శాకంబరీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారికి సహస్ర కలశాభిషేకోత్సవం శోభాయమానంగా జరిగింది. ‘కుడా’ చెర్మన్ ఇనగాల వెంక్రటామిరెడ్డి, దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం అమ్మవారి సన్నిధిలో జ్యోతిప్రజ్వలనం చేసి ఉత్సవాలను ప్రారంభించారు. సహస్ర కళశాభిషేకం మధ్యాహ్నం ప్రారంభమైంది. భద్రకాళి పంచమూర్తులకు, శ్రీచక్రానికి అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని కాళీక్రమంలో అలంకరించారు. రాత్రి కామేశ్వరీ నిత్యాక్రమంలో ఆవరణార్చనలు జరిపారు. భక్తులతో దేవాలయం కిక్కిరిసిపోయింది. భద్రకాళి శరణం మమ అంటూ జయజయధ్వానాలు చేస్తూ పులకించిపోయారు. ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ శేషు భారతి, సూపరింటెండెంట్ అద్దంకి విజయ్కుమార్, ఆలయ ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శుక్రవారం ఉదయం కపాలినీ క్రమంలో, సాయంత్రం భగమాలినీక్రమంలో పూజలు జరపనున్నారు.
శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం