ఆకలి బాధ తీరేనా.. | - | Sakshi
Sakshi News home page

ఆకలి బాధ తీరేనా..

Jun 25 2025 1:37 AM | Updated on Jun 25 2025 1:37 AM

ఆకలి

ఆకలి బాధ తీరేనా..

జూనియర్‌ కళాశాలల్లో అమలుకు నోచుకోని మధ్యాహ్న భోజనం

కాటారం: ఇంటర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు కలగా మిగిలిపోయింది. దీంతో విద్యార్థులు మధ్యాహ్నం భోజనం కోసం అలమటిస్తూ అర్ధాకలితో చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించి మంత్రివర్గ ఆమోదం సైతం తెలిపినప్పటికీ అమలుకు నోచుకోలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గతేడాది అధికారంలోకి రాగానే సంబంధితశాఖ అధికారుల నుంచి ప్రతిపాదనలు కోరింది. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై 15 రోజులు కావస్తున్నప్పటికీ పథకం అమలుపై ఇప్పటివరకు స్పష్టత లేదు. దీంతో ఈ ఏడాది సైతం కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

దూర ప్రాంతం నుంచి వచ్చే వారికి తిప్పలు..

ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలులో లేకపోవడంతో ఆయా కళాశాలలకు దూర ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. చాలా కళాశాలలు జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లోనే ఉండటంతో గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఉదయం పూట తినకుండానే వస్తున్నారు. మధ్యాహ్నం సైతం తినకుండా కళాశాలల పక్కన ఉండే కిరాణాదుకాణాల్లో తినుబండారాలు, బిస్కెట్లు తింటూ అర్ధాకలితో చదువు నేర్చుకుంటున్నారు. దీంతో అలిసిపోయి విద్యార్థులు సరిగా క్లాస్‌లు వినలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. మరికొందరు విద్యార్థులైతే కళాశాలలకు రావడమే మానేస్తున్నారు.

ఉత్తీర్ణత, హాజరుశాతం పెరిగే అవకాశం..

కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తే విద్యార్థుల ఉత్తీర్ణత, హాజరుశాతం పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు అధికంగా ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్నారు. వారికి మధ్యాహ్న భోజనం ఇంటి నుంచి తీసుకొచ్చుకునే పరిస్థితి, సమయాభావం తక్కువగా ఉంటుంది. దీంతో వారు మధ్యాహ్నం సమయం వరకు తరగతులకు హాజరై ఇంటికి వెళ్తున్నారు. సరిగా తరగతులకు హాజరుకాకపోవడం వలన ఈ ప్రభావం పరీక్ష ఫలితాల్లో చూపిస్తుంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఒక వేళ మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తే విద్యార్థులు సక్రమంగా తరగతులకు హాజరై ఉత్తీర్ణ శాతం పెరిగే అవకాశాలు ఉంటాయని పలువురు భావిస్తున్నారు.

రూ.కోటి అంచనా..

జిల్లాలో ఐదు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, రెండు ప్రభుత్వ డిగ్రీ, ఒక పాలిటెక్నిక్‌, రెండు ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో సుమారుగా రెండు వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి మధ్యాహ్న భోజనం అందించడానికి రూ.కోటి మేర ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

జిల్లాలోని కళాశాలల వివరాలు..

కళాశాలలు విద్యార్థులు

(సుమారు)

జూనియర్‌ 05 1,000

డిగ్రీ 02 550

పాలిటెక్నిక్‌ 01 172

ఐటీఐ 02 130

మొత్తం 10 1,852

కార్యరూపం దాల్చేనా..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కొన్నేళ్లుగా ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తూ వస్తున్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. ఇదే ఫార్ములా ప్రభుత్వ కళాశాలల్లో ప్రయోగిస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి సైతం ప్రతిపాదన అందజేసినప్పటికీ అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. 2018లో అప్పటి ప్రభుత్వం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని ముందడుగు వేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. 2021లో మారోమారు ఈ ప్రయత్నం చేసినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. ఈ విద్యా సంవత్సరం నుంచి కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించాలని 2024–25 విద్యా సంవత్సరం చివరలో ప్రతిపాదనలు సిద్ధంచేశారు. కానీ ఇప్పటివరకు ఆ ప్రతిపాదనల ఊసే లేకుండా పోయింది. ఒక్కో విద్యార్థికి రూ.20 నుంచి రూ.25 వరకు ఖర్చు అవుతుందని అధికారులు చెప్పుకొస్తున్నారు.

గతేడాది ప్రభుత్వానికి ప్రతిపాదనలు

నేటికీ స్పష్టత కరువు

విద్యార్థుల హాజరుశాతంపై ప్రభావం

ఆదేశాలు రాలేదు..

కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలుకు సంబంధించి ఇప్పటివరకు ఆదేశాలు రాలేదు. గతేడాది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉన్నతాధికారుల ద్వారా ప్రతిపాదనలు పంపించాం. కళాశాలలు, విద్యార్థుల సంఖ్య తదితర వివరాలు అందజేశాం. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదు.

– వెంకన్న, ఇంటర్మీడియట్‌ నోడల్‌ ఆఫీసర్‌

ఆకలి బాధ తీరేనా..1
1/2

ఆకలి బాధ తీరేనా..

ఆకలి బాధ తీరేనా..2
2/2

ఆకలి బాధ తీరేనా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement