
ఎంజీఎంలో సెక్యూరిటీ గార్డు, స్వీపర్పై దాడి
ఎంజీఎం : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలోని సెక్యూరిటీ సిబ్బంది, స్వీపర్పై మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈఘటనపై అటు కాంట్రాక్ట్ యాజమాన్యం, ఇటు ఆస్పత్రి అధికారులు కనీసం పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో చికిత్స కోసం వచ్చిన ఓ యువకుడు అత్యవసర విభాగంలో రక్తం మరకలు తుడుస్తున్న ఓ స్వీపర్పై అసభ్య పదజాలంతో దూషించడంతో అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డుపై దాడి చేశాడు. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉండడంతో అక్కడున్న ఓ వార్డు బాయ్ వచ్చి సదరు వ్యక్తిని సముదాయించి పంపించేశాడు. సదరు యువకుడు మళ్లీ తిరిగి వచ్చి విధుల్లో ఉన్న పీఆర్ఓకు ఫోన్ చేయించి సెక్యూరిటీ సిబ్బందిని మరోసారి దుర్భాషలాడాడు. ఈఘటనలో అక్కడికి చేరుకున్న పీఆర్ఓ ‘అతను ఓ వీఐపీ.. అతడితో పెట్టుకుంటే మీ ఉద్యోగాలు పోతాయ్’ అని సెక్యూరిటీ గార్డు, స్వీపర్లపై రుసరుసలాడాడు. బెదిరించి దాడి చేసిన సదరు యువకుడికి దగ్గరుండి చికిత్స అందించి పంపించారు. కాగా, ఈఘటనతో ఖంగుతిన్న సెక్యూరిటీ గార్డులు మంగళవారం ఉదయం తమ కార్యాలయం వద్ద కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చి వివరాలు సేకరించి వెళ్లిపోయారు. ఈ ఘటనపై సెక్యూరిటీ, శానిటేషన్ కాంట్రాక్టర్.. ఎంజీఎం పరిపాలనాధికారులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. దీంతో తాము ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఎంజీఎం పరిపాలనాధికారులు చెప్పడం కొసమెరుపు.
మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్చల్
పోలీసులకు ఫిర్యాదు చేయని
ఎంజీఎం అధికారులు
ఎవరు ఆ వీఐపీ?
మద్యం మత్తులో వచ్చి సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి పీఆర్ఓకు ఫోన్ చేయించి చికిత్స పొందిన ఆ వీఐపీ ఎవరు అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. దాడికి గురైన మహేశ్ అనే సెక్యూరిటీ గార్డు ఎంజీఎంలో వైద్యుల వద్ద చికిత్స పొందాడు. ఇంత జరిగినా ఆ వీఐపీ రోగిపై చర్యలు తీసుకునేందుకు సెక్యూరిటీ కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయకపోవడం, ఎంజీఎం పరిపాలనాధికారులు రాతపూర్వకంగా ఫిర్యాదు అందలేదని దాటవేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్ముందు ఏదైనా పెద్ద ఘటన జరిగితే తమ పరిస్థితి ఏంటని సెక్యూరిటీ సిబ్బంది, స్వీపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎంజీఎంలో సెక్యూరిటీ గార్డు, స్వీపర్పై దాడి