
సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దు
ములుగు రూరల్: పోలీస్ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా పనితనాన్ని మెరుగుపరుచుకోవాలని ఎస్పీ డాక్టర్ శబరీశ్ సూచించారు. ఈ మేరకు మంగళవారం పోలీస్ హెడ్ క్వాటర్స్లో డ్యూటీమీట్ను ప్రారంభించి మాట్లాడారు. అధికారులు, సిబ్బంది నైపుణ్య అభివృద్ధి, ప్రదర్శనకు సరైన వేదిక డ్యూటీ మీట్ అన్నారు. నేర పరిశోధన, నేర స్థల పరిశోధన, ఫొటోగ్రఫీ, వీఐపీ మూమెంట్, డాగ్ స్క్వాడ్ పనితనం, ఫింగర్ ప్రింట్ తీసే విధానం, బాంబు డిస్పోజల్, వీడియోగ్రఫీ ద్వారా నేరస్తులను కనుగొనుట, కంప్యూటర్ పరిజ్ఞానం, అంశాలపై రాత పరీక్ష, మౌఖిక పరీక్షలు ఉంటాయని వివరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రివార్డులు సాధించాలని తెలిపారు. ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లకు కొన్ని అంశాలు, ఏఎస్సై, కానిస్టేబుళ్లకు కొన్ని అంశాలపై పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నేరం జరిగిన పద్ధతులను పరిశోధనను విధులకు అనుకూలంగా మార్చుకోవాలన్నారు. సందేహాలు ఉంటే ఉన్నతాధికారులను, అనుభవం ఉన్న అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ, ములుగు డీఎస్పీ రవీందర్, సీఐలు సురేశ్ కుమార్, రవీందర్, రిజర్వు ఇన్స్పెక్టర్లు స్వామి, సంతోష్కుమార్, తిరుపతి, ఎస్సైలు, ఆర్ఎస్సైలు పాల్గొన్నారు.