
భూ సమస్యలు పరిష్కరించే దిశగా..
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం జిల్లాలో అమల్లోకి రానుంది. ౖపైలట్ ప్రాజెక్ట్గా జిల్లాలో రేగొండ మండలాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. నేటినుంచి ఇద్దరు తహసీల్దార్లు, అధికారులు, సిబ్బందితో కూడిన రెండు బృందాలు రేగొండ మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించనున్నారు. చట్టం అమల్లోకి వస్తే భూ సమస్యలు తీరుతాయని రైతులు ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఆర్ఓఆర్ చట్టాన్ని సవరించి నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే జిల్లాలో గతనెల 17నుంచి ఈ చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించారు.
పైలెట్గా రేగొండ మండలం
సమస్యల పరిష్కారానికి పైలెట్ ప్రాజెక్ట్ కింద రేగొండ మండలాన్ని ఎంపిక చేసి రెండు బృందాలను నియమించారు. ఈ బృందాలకు రైతులు నేరుగా భూ సమస్యలపై ఫిర్యాదులు చేయవచ్చు. భూ తగాదాలు, వారసత్వ బదిలీలు, మ్యూటేషన్లు, ఏ సమస్య ఉన్నా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను ఆర్డీఓ స్థాయిలో, కలెక్టర్ స్థాయిలో పరిష్కరించనున్నారు. వెనువెంటనే సమస్యలు పరిష్కారం కానున్నాయి. జిల్లాలో ఇప్పటికే అనేక మంది తమ భూమి హక్కుల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో భూ ప్రక్షాళన సందర్భంగా అనేక తప్పులు దొర్లడంతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో గతంలో సుమారు 50 వేలకు పైగానే సాదాబైనామాల కోసం రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అవి పెండింగ్లోనే ఉన్నాయి. ఈ చట్టం రావడంతో పరిష్కారమయ్యే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అసైన్డ్, అటవీ భూముల వద్ద కూడా వివాదాలున్నాయి. పార్ట్–బీలో పేర్కొన్న నిషేధ జాబితాలు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ చట్టంతో సమస్యలు తీరుతాయనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. భూభారతిలో ఇక నుంచి ప్రతి భూమికి భూధార్ పేరుతో ప్రత్యేక గుర్తింపు సంఖ్య నంబర్లు సైతం ఇవ్వనున్నారు. రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు సులభంగా అయ్యేలా చట్టాన్ని రూపొందించారు. తహసీల్దార్లకు, ఆర్డీఓలకు సైతం మ్యూటేషన్ అధికారం కల్పించడం వంటివి ఈ చట్టంలో పొందుపర్చారు. ప్రస్తుతం రేగొండ మండలంలో దరఖాస్తులు తీసుకున్న అనంతరం సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది. నూతన చట్టం ప్రకారం సమస్యలను పరిష్కరిస్తే చాలామందికి ఉపశమనం కలుగనుంది. ఒక వేళ సమస్యలు పరిష్కారం కాకపోతే ఎందుకు కాలేదన్నది దరఖాస్తు చేసుకున్న రైతులకు నివేదిక అందిస్తారు. జిల్లా మొత్తం అమలైతే భూ సమస్యలు దాదాపుగా తీరే అవకాశాలుంటాయి.
టీమ్–2
సత్యనారాయణస్వామి
గణపురం తహసీల్దార్
భరత్, డీటీ
దేవేందర్, ఆర్ఐ
నిరజంన్, సర్వేయర్
రహ్మత్పాషా, ఆర్ఐ
శ్రీకాంత్, జూనియర్ అసిస్టెంట్
హరీష్కుమార్, ఆపరేటర్
పర్యటించే గ్రామాలు (ఏ తేదీన..)
లింగాల 5వ తేది
పొనగండ్ల 6వ తేది
భాగిర్థిపేట 7వ తేది
రామన్నగూడెం 8వ తేది
దమ్మన్నపేట 9వ తేది
టీమ్–1
శ్వేత, రేగొండ తహసీల్దార్
అబ్దుల్ రజాక్, డీటీ
భరత్కుమార్, ఆర్ఐ
వెంకటేష్, సీనియర్ అసిస్టెంట్
తిరుపతి, సర్వేయర్
రమేష్, జూనియర్ అసిస్టెంట్
రాజు, ఆపరేటర్
పర్యటించే గ్రామాలు (ఏ తేదీన..)
కొడవటంచ 5వ తేది
మడ్తపల్లి 6వ తేది
రేగొండ 7వ తేది
తిరుమలగిరి 8వ తేది
కనిపర్తి 9వ తేది
రేపాక 12వ తేది
పైలట్ ప్రాజెక్ట్టుగా రేగొండ మండలం ఎంపిక
నేటినుంచి 12వరకు గ్రామాల్లో పర్యటన