
దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
● మంత్రి ధనసరి సీతక్క
ములుగు: వైకల్యమనేది కేవలం శరీరానికి మాత్రమేనని మనసుకు కాదని, దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమ, గ్రామీణ నీటి పారుదల శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా సంక్షేమ అధికారి శిరీష అధ్యక్షతన మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని గోవిందరావుపేట, వెంకటాపూర్ మండలాల పరిధిలోని బళ్ల సంజయ్, నాగయ్య, కృష్ణ, కందికట్ల సాంబ య్యకు రూ.2లక్షల విలువైన బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఉద్యోగాలు, ఉపాధికి ఏ కార్యాలయాల చుట్టూ తిరుగకుండా ప్రభుత్వం ప్రత్యేక యాప్ను రూపొందించిందన్నారు. కలెక్టర్ దివాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకంలో దివ్యాంగులకు తొలి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ శాలినీ మిశ్రా మాట్లాడుతూ మంత్రి సీతక్క చొరవతో ఈ ఉపకరణాలను ఉచితంగా అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్, సంపత్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ తదితరులున్నారు.