
ముగిసిన టెన్త్ పరీక్షలు
భూపాలపల్లి అర్బన్: జిల్లా వ్యాప్తంగా 20 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన టెన్త్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు సాంఘిక శాస్త్రం పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. చివరి రోజు మొత్తం 3,449 మంది విద్యార్థులకు 3,442 మంది విద్యార్థులు హాజరుకాగా ఏడుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు వెల్లడించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఎలాంటి మాల్ప్రాక్టీస్, మాస్కాపింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆనందంగా గడపాలి
భూపాలపల్లి: ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పనిసరి, విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సుదీర్ఘకాలం పోలీసు శాఖకు సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ఎస్సై పోరిక లాల్ సింగ్ను జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఎస్పీ సత్కరించి, కానుక అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎలాంటి రిమార్కులు లేకుండా సర్వీసును పూర్తి చేసి పదవీ విరమణ పొందడం అభినందనీయం అన్నారు. కుటుంబానికి దూరంగా ఉంటూ.. ప్రజలకు సేవలు అందించడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1987వ సంవత్సరంలో లాల్ సింగ్ పోలీసు కానిస్టేబుల్గా పోలీసుశాఖలోకి అడుగుపెట్టి దాదాపు 38 సంవత్సరాలపాటు సేవలు అందించారని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో తనవంతు పాత్రను పోషించడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నగేష్, రత్నం, పోలీస్ అధికారుల సంఘం నేత యాదిరెడ్డి, ఎస్సై లాల్ సింగ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ముగిసిన టెన్త్ పరీక్షలు