
సమ్మక్కసాగర్లో ఇసుక మేటలు
సమ్మక్కసాగర్ బ్యారేజీలోకి నీటి ప్రవాహం తగ్గడంతో కనిపిస్తున్న ఇసుక మేటలు
కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల గోదావరిపై నిర్మించిన సమ్మక్కసాగర్ బ్యారేజీకి నీటి ప్రవాహం తగ్గడంతో ఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి. జూన్ మొదటి వారంలో వర్షాలు పడడంతో బ్యారేజీలోకి కొంత నీరు వచ్చి చేరింది. దీంతో బ్యారేజీలో నీటి ప్రవాహం కొంత పెరిగింది. ప్రస్తుతం వర్షాలు పడకపోవడంతో ఎగువ నుంచి గోదావరిలోకి వరద ప్రవాహం తగ్గిపోయింది. దీంతో సమ్మక్క సాగర్ బ్యారేజీలో ఇసుక మేటలు తేలి కొంత మేర ఎడారిగా దర్శనమిస్తున్న పరిస్థితి నెలకొంది. బ్యారేజీలోకి ఎగువ నుంచి 5,800 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా బ్యారేజీ వద్ద రెండు గేట్లు ఎత్తి 6వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. బ్యారేజీ సామర్థ్యం 6.94 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.922 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది.
ఎగువ నుంచి తగ్గిన నీటి ప్రవాహం