
ప్రతీ రైతుకు భరోసా
భూపాలపల్లి రూరల్: రైతు భరోసా కింద ఆదివారం వరకు జిల్లాలో రూ.132,52,49,227 నేరుగా రైతుల ఖాతాల్లో జమయ్యాయని, ప్రతీ రైతుకు రైతు భరోసా జమ అవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరునాయక్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతు భరోసా పథకం కింద జిల్లాలోని 1,14,011మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ.1,32,52,49,227 నేరుగా జమచేసినట్లు తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, సాగు అవసరాలకు ఈ నిధులు ఉపయోగపడతాయని తెలిపారు.
చర్యలు తప్పవు..
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలంలో ప్రభుత్వ పనులకు సంబంధించిన శిలాఫలకాలను ధ్వంసం చేసిన వ్యక్తులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి సీఐ నరేష్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం నాగారం గ్రామంలో పోలీసులు విచారణ చేపట్టారు. శిలాఫలకాలు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని తెలిపారు.
జిల్లాస్థాయి క్రీడా పాఠశాల ప్రవేశాల ఎంపిక
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 25వ తేదీన క్రీడా పాఠశాలకు జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాము ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలస్థాయిలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో జిల్లాస్థాయి క్రీడా పాఠశాల ప్రవేశాలకు ఎంపికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాస్థాయి పోటీలకు హాజరయ్యే విద్యార్థులు పుట్టినతేది ధృవీకరణ పత్రం, కుల, స్టడీ సర్టిఫికెట్, పాస్ ఫొటోలు, ఆధార్కార్డు తీసుకురావాలని సూచించారు.
సిరిసిల్ల పరామర్శ
టేకుమట్ల: ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేశ్ కుటుంబ సభ్యులను ఆదివారం మాజీ ఎంపీ, ప్రణాళికా సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పరామర్శించారు. ఈ సందర్భంగా రవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాజర్ల రవి పీడిత ప్రజల కోసం తన జీవితాన్నే త్యాగం చేశాడన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీటీసీ సంగి రవికుమార్, మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్గౌడ్, నాయకులు కత్తి సంపత్, శ్రీనివాస్, రవిందర్, వంగ నరేష్, కోరె చంద్రమౌళి, జంగపెల్లి సారయ్య, తిరుపతి, ఉన్నారు.
పామాయిల్ తోట దగ్ధం
రేగొండ: మండలంలోని రేపాకపల్లి గ్రామంలో ఓ రైతుకు చెందిన పామాయిల్ తోటకు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం నిప్పుపెట్టారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేపాకపల్లి గ్రామానికి చెందిన చేరి సబిత రెండు ఎకరాలలో పామాయిల్ తోట సాగుచేశారు. పంట కోతకు రావడంతో ఆదివారం ఉదయం కూలీలతో చేను దగ్గరికి వెళ్లే సరికి పంట మొత్తం దగ్ధమైంది. చేతికందిన పంట కాలిపోవడంతో రూ.3లక్షలు నష్టపోయామని బాధిత రైతు కన్నీరుమున్నీరయ్యారు.
యాజమాన్య విధానాలు
సరికాదు
భూపాలపల్లి అర్బన్: సింగరేణి యాజమాన్యం చేపడుతున్న బదిలీల విధానాలు సరికాదని సీఐటీయూ బ్రాంచ్ కార్యదర్శి కంపేటి రాజయ్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాలకు మించి ఎక్కువ సర్వీస్ ఉన్న కార్యాలయ సిబ్బందిని ఇతర శాఖలకు బదిలీ చేయాలని కోరారు. గతంలో పనిచేసిన విభాగాలకు బదిలీ చేయకూడదన్నారు. పరస్పర బదిలీలకు కఠిన నిబంధనలతో కూడిన సర్క్యులర్ యాజమాన్యం సవరించాలని కోరారు. అధికారులు ఐదు సంవత్సరాల నుంచి ఒకే ఏరియాలో పనిచేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ 10 సంవత్సరాలకు పెంచడం సరికాదన్నారు.
పోరాటం చేయాలి
ములుగు రూరల్: సామాజిక న్యాయం కోసం ప్రతిఒక్కరూ పోరాటం చేయాలని సామాజిక న్యాయ వేదిక జిల్లా అధ్యక్షుడు పోరిక శ్యామల్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెడ్డి కులానికి చెందిన వారికే ఎక్కువ సంఖ్యలో మంత్రి పదవులు దక్కుతున్నాయని ఆరోపించారు.

ప్రతీ రైతుకు భరోసా