‘టెట్‌’ పరీక్షకు మరో 600 మంది టీచర్లు | - | Sakshi
Sakshi News home page

‘టెట్‌’ పరీక్షకు మరో 600 మంది టీచర్లు

Apr 14 2026 7:58 AM | Updated on Apr 14 2026 7:58 AM

జనగామ: తెలంగాణ టెట్‌ 2026కు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈసారి సిలబస్‌లో ఎలాంటి మార్పులు లేకుండా గత విధానమే కొనసాగించనుంది. గణితం, సైన్స్‌ అభ్యర్థులకు మునుపటిలాగే ఒకే టెట్‌ పేపర్‌ ఉంటుంది. ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు బీఎడ్‌, డీఎడ్‌తో సంబంధం లేకుండా ప్రస్తుతం ఎస్జీటీలు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెడ్‌ మాస్టర్లు టెట్‌ పేపర్‌–1కు అర్హులుగా నిర్ణయించారు. జిల్లాలో సుమారు 600 మంది ఇన్‌సర్వీస్‌ టీచర్లు ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. ఇప్పటికే పేపర్‌–1 ఉత్తీర్ణత సాధించిన వారు మళ్లీ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. అయితే నిరుద్యోగులు డీఎస్సీ వెయిటేజ్‌ కోసం ఎన్నిసార్లు అయినా టెట్‌ రాసుకునే అవకాశం ఉంది.

అర్హతలు ఇలా

ప్రస్తుతం స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో ఉన్న.. టెట్‌ లేని వారు పేపర్‌–2 తప్పనిసరిగా రాయాలి. ఎస్జీటీలు పేపర్‌–1 రాయాల్సి ఉండగా, భవిష్యత్‌లో పదో న్నతుల కోసం బీఎడ్‌ ఉన్న వారు పేపర్‌–2 కూడా రాయవచ్చు. సబ్జెక్టు ఆధారంగా మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, బయాలజీ అభ్యర్థులు సంబంధిత పేపర్‌–2, సోషల్‌ సబ్జెక్టుకు సంబంధించిన వారు సోషల్‌ పేపర్‌–2 రాయాల్సి ఉంటుంది. నిరుద్యోగుల విషయంలో పేపర్‌–1 రాయాలంటే తప్పనిసరిగా డీఎడ్‌ అర్హ త ఉండాలి. బీఎడ్‌ ఉన్న వారికి పేపర్‌–1 అవకాశం లేదు. ఆ అభ్యర్థులు పేపర్‌–2 మాత్రమే రాయాలి.

ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు

ఈనెల 15 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్‌ 15 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించి, జూలై చివరి వారంలో ఫలితాలు వెల్లడించనున్నారు. జనరల్‌, బీసీ అభ్యర్థులకు ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, ిపీహెచ్‌సీ అభ్యర్థులకు రాయితీగా ఒక్క పేపర్‌కు రూ.700, రెండు పేపర్ల కు రూ.950గా నిర్ణయించారు. అర్హత మార్కులు ఓసీ/ఈడబ్ల్యూఎస్‌కు 90 మార్కులు (60శాతం), బీసీలకు 75 మార్కులు(50శాతం), ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 60 మార్కులు (40శాతం) ఉన్నాయి.

జిల్లాలో భారీ స్పందన

జిల్లాలో టెట్‌కు భారీ స్పందన కనిపిస్తోంది. పేపర్‌–1 కోసం సుమారు 1,000 మంది డీఎడ్‌ నిరుద్యోగులు, పేపర్‌–2 కోసం సుమారు 8 వేల మంది అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. వీరిలో ఇప్పటికే 70 శాతం మంది టెట్‌ అర్హత సాధించి డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఆలస్యంపై నిరుద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పది సార్లు టెట్‌ నిర్వహించగా, డీఎస్సీ మాత్రం రెండు సార్లే జరిగింది. జిల్లాలో 2010కు ముందు నియమితులైన 2,115 మంది ఉపాధ్యాయుల్లో ఇప్పటికే 1,000 మంది టెట్‌ పాస్‌ కాగా, మరో 500 మంది రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉండటంతో మినహాయింపు పొందనున్నారు. ఇంకా 600 మంది టెట్‌ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. దీంతో జిల్లాలో టెట్‌కు ప్రాధాన్యం మరింత పెరిగింది.

నోటిఫికేషన్‌ విడుదల

సిలబస్‌ యథాతథం

నిరుద్యోగుల్లోనూ భారీ స్పందన

పేపర్‌–1 కోసం 1,000, పేపర్‌–2కు 8వేల మంది అభ్యర్థులు సిద్ధం

టెట్‌ షెడ్యూల్‌ ఇలా

ఏప్రిల్‌ 15: ఇన్ఫర్మేషన్‌ బులిటిన్‌, డిటైల్‌ నోటిఫికేషన్‌ అందుబాటులోకి రానుంది.

దరఖాస్తులు: ఏప్రిల్‌ 15 నుంచి 30వ తేదీ వరకు (https://schooledu.telangana.gov.in) ఆన్‌లైన్‌ ద్వారా ఫీజులు చెల్లించవచ్చు.

హెల్ప్‌డెస్క్‌: హెల్ప్‌డెస్క్‌ సేవలు ఏప్రిల్‌ 15 నుంచి ఫలితాల ప్రకటన వరకు అందుబాటులో ఉంటాయి.

హాల్‌టికెట్లు: జూన్‌ 9వ తేదీ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

పరీక్షలు: జూన్‌ 15 నుంచి జూన్‌ 30 మధ్య నిర్వహిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement