
ఏడాదిలోపే బదిలీలు!
కాజీపేట అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులు సాధారణంగా రెండు నుంచి మూడేళ్ల తర్వాత బదిలీ అవుతారు. కానీ, ఇందుకు భిన్నంగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలోని అధికారులను ఏడాదిలోపే బదిలీలు చేయడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేసింది. ఇందులో భాగంగా 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు స్లాట్ బుకింగ్, పారదర్శక సేవలకు ఈ–సైన్తో రిజిస్ట్రేషన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై పర్యవేక్షణ కొనసాగించే జిల్లా రిజిస్ట్రార్లకు ఏడాదిలోపే స్థానచలనం కల్పించింది.
పదోన్నతులకు బ్రేక్..
జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్లుగా విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు జిల్లా రిజిస్ట్రార్గా పదోన్నతులు కల్పించడంలో జాప్యం అవుతోంది. సుమారు నాలుగేళ్లుగా జిల్లా రిజిస్ట్రార్ స్థానంలో అధికారులు లేకపోవడంతో ఇన్చార్జ్లతోనే పాలన కొనసాగుతోంది. కాగా, ఒక్కో జిల్లా రిజిస్ట్రార్ రెండు మూడు కార్యాలయాలకు పనిచేయాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో బదిలీ అయిన ఫణీందర్ హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్గా ఆఫీస్ డ్యూటీలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జ్గా, కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్కుమార్ వరంగల్ జిల్లా ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. సీనియార్టీ ప్రకారం తమకు పదోన్నతి కల్పించాలని గతంలో విధులు నిర్వర్తించిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నలుగురు జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్లు, వివిధ జిల్లాలకు చెందిన గ్రూప్–1 అధికారులు కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో పదోన్నతులకు బ్రేక్ పడింది.
త్వరలో సబ్ రిజిస్ట్రార్ల బదిలీ!
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి గతేడాది ఆగస్టులో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అటెండర్ స్థాయి నుంచి జిల్లా రిజిస్ట్రార్ వరకు బదిలీలు అయ్యారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాధ్యతలను స్వీకరించి లాంగ్ లీవ్లోకి వెళ్లిపోయిన సబ్ రిజిస్ట్రార్లు, సహాయ రిజిస్ట్రార్ చిట్స్లు అనగా స్టేషన్ఘన్పూర్, వరంగల్ ఆర్వో చిట్స్ కార్యాలయంలోని అధికారులతోపాటు వరంగల్ ఆర్వోకు చెందిన సబ్ రిజిస్ట్రార్లు సైతం స్థానచలనంలో భాగంగా నేడో రేపో బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, మేరా నంబర్ ఆయేగా అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చర్చించుకోవడం గమనార్హం.
డేంజర్ జోన్లకు వెళ్లేందుకు జంకుతున్న
సబ్ రిజిస్ట్రార్లు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ఘన్పూర్ సబ్ రిజిస్ట్రార్తోపాటు ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్లు ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు డేంజర్ జోన్లుగా మారిపోయాయి. ట్రాన్స్ఫర్ ఓకే కాని డేంజర్ జోన్లకు వద్దు అంటూ తలలు పట్టుకుంటున్నారు సబ్ రిజిస్ట్రార్లు.
పదోన్నతులు లేక
ఇన్చార్జ్లతోనే పాలన
నేడో రేపో సబ్ రిజిస్ట్రార్లకు స్థానచలనం