
ఇంకెప్పడు..?
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం సర్కారు స్కూళ్లలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ(ప్రీ ప్రైమరీ) విద్యను అమలు చేస్తున్నట్లు నూతన విద్యా సంవత్సరానికి ముందుగానే ప్రకటించింది. రాష్ట్రంలో వెయ్యి ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించబోతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. దీంతో ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలు, టీచర్లు ప్రభుత్వ ఉద్దేశాన్ని ‘బడి బాట’లో తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ వారి పిల్లలను ప్రీ ప్రైమరీ స్కూల్లో చేర్పించుకున్నారు. రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ పీఎస్లో సుమారు 40, జనగామ మండలం యశ్వంతాపూర్లో 25, పసరమడ్లలో 25, ఇతర పాఠశాలల పరిధిలో ప్రీ ప్రైమరీ అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. అయితే ఇటీవల 210 ప్రీ ప్రైమరీ పాఠశాలల సంబంధించి విడుదల చేసిన జాబితాలో జనగామ జిల్లాకు చోటు దక్కలేదు. మిగతా పాఠశాలల్లో సైతం ఈ విద్యను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై పదిహేను రోజులు గడిచిపోతున్నా ఆచరణకు నోచుకోవడం లేదు. సర్కారు నిర్ణయంలో ఆలస్యం జరుగుతుండడంతో తల్లిదండ్రులకు హామీ ఇచ్చిన ఉపాధ్యాయులు సందిగ్ధంలో పడిపోయారు. ప్రీ ప్రైమరీలో నేటికీ విద్యాబోధన ప్రారంభం కాకపోవడంతో కొద్ది రోజులు వేచి చూసి తమ పిల్లలను ప్రైవేట్ కిడ్స్ స్కూళ్లకు పంపించేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. ఇలా అయితే ప్రభుత్వ పాఠశాలల పరిధిలో వచ్చే విద్యాసంవత్సరం ఒకటో తరగతి అడ్మిషన్ల సంఖ్య తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రెండేళ్ల క్రితమే మూడు ప్రీ ప్రైమరీ..
జిల్లాలో రెండేళ్ల క్రితమే సమగ్ర శిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ) స్కీంలో మూడు పాఠశాలల పరిధిలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ నిర్వహిస్తున్నారు. బచ్చన్నపేట మండలం పోచన్నపేట పీఎస్(55), కొడవటూరు పీఎస్(10), బచ్చన్నపేట పీఎస్(25)లో ఈ విద్య కొనసాగుతున్నది. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు గెస్ట్ ఫ్యాకల్టీగా స్థానికంగా నివసించే నిరుద్యోగుల నుంచి అర్హత ఆధారంగా ఒక టీచర్, ఆయాను నియమించారు. టీచర్కు నెలవారీ వేతనం రూ.8వేలు, ఆయాకు రూ.6వేలతో పాటు ఏడాదికి రూ.1.50లక్షల నిధులను ఎస్ఎస్ఏ ద్వారా అందిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ప్రీ ప్రైమరీ స్కూళ్లను జిల్లాలో ఏర్పాటు చేస్తే సంఖ్య ఆధారంగా నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు లభిచడంతో పాటు పేద కుటుంబాల తల్లిదండ్రులపై ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల భారం తగ్గుతుంది. అంతే కాకుండా ప్రభుత్వ స్కూళ్లలో ఒకటో తరగతి అడ్మిషన్లు పెరగడానికి దోహదపడుతుంది.
గ్రీన్ సిగ్నల్ రాగానే..
జిల్లాలో ప్రీ ప్రైమరీ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ప్రారంభిస్తాం. అయినప్పటికీ ప్రీ ప్రైమరీ స్థాయి పిల్లలను అంగన్వాడీతో పాటు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించి బోధన సాగిస్తున్నాం. ప్రీ ప్రైమరీ స్థాయిలో ఆశించిన మేర అడ్మిషన్లు వచ్చాయి. ఈ విద్యకు ఎక్కడా ఆటంకం లేదు.
– భోజన్న, డీఈఓ
మూడింట్లో నిర్వహిస్తున్నాం..
బచ్చన్నపేట మండల పరిధి మూడు పాఠశాలలో రెండు సంవత్సరాలుగా ప్రీ ప్రైమరీ స్కూ ల్స్ నడిపిస్తున్నాం. ఇందులో సు మారు 90 మంది పిల్లలు ఉన్నా రు. ప్రైవేట్కు దీటుగా ఇందులో చిన్నారుల అభ్యసనా సామర్థ్యాలను పెంచేందుకు కృషి చేస్తున్నాం.
– బొమ్మగాని శ్రీనివాస్,
జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్
ఇదీ సర్కారు ఉద్దేశం..
ప్రీ ప్రైమరీ స్కూల్ విద్యా బోధన పిల్లల అధికారిక అభ్యసనా అనుభవంలో ప్రాథమిక దశకు కీలకంగా ఉపకరిస్తుంది. మూడు నుంచి ఐదేళ్ల వయసు చిన్నారుల కోసం ఈ విద్యకు రూపకల్పన చేశారు. ప్రీ ప్రైమరీలో పిల్లలకు అభాస్యంపై ప్రేరణ కలిగించడం, వారిలోని నైపుణ్యాలను గుర్తించే అవకాశం ఉంటుంది. చిత్రలేఖనం, కథలు చెప్పడం, ఆటలు, రంగులు, ఆకారాలు, అక్షరాలు, సృజనాత్మకతను వెలికి తీసేందుకు దోహదపడుతుంది. ఐదేళ్లు నిండక ముందే పిల్లలు సహచ ర స్నేహితులు, పెద్దలతో మాట్లాడడంలో సహాయ పడుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడానికి పునాదిగా పనిచేస్తుంది. సర్కారు స్కూళ్లలో ఒకటో తరగతిలో అడ్మిషన్ల సంఖ్య పెరగడానికి అవకాశం కలుగుతుంది.

ఇంకెప్పడు..?

ఇంకెప్పడు..?