
ఫిట్నెస్ ఆలస్యమేనా?
జనగామ: ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు బస్సు సర్వీసుల సేవల విషయంలో కాసింత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు పిల్లలను తీసుకొచ్చే సమయంలో ఆర్టీఏ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కిటికీలకు జాలీలు, డోరు వద్ద క్లీనర్ పర్యవేక్షణ తప్పనిసరి. బస్సు ఎక్కి పాఠశాలకు చేరుకుని, తిరిగి ఇంటికి చేరే వరకు కేర్గా చూసుకోవాలి. గతంలో జిల్లాలోని రెండు ప్రాంతాల్లో విద్యార్థులు బస్సు దిగి వెళ్లే క్రమంలో చక్రాల కింద నలిగి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ ఇతర ఆర్టీఏ నిబంధనలు పాటించాలని సంబంధిత అధికారులు పదే పదే చెబుతూనే ఉన్నారు. వేసవి సెలవులు ముగిసే సమయంలో ఇరవై రోజు ల ముందు నుంచే అన్ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు నోటీసులను పంపించారు. జిల్లాలో 190 ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉండగా.. ఇందులో 150 సర్వీసులకు ఫిట్నెస్ పూర్తయ్యింది. మరో 40 బస్సులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 20 బస్సులకు ఆర్టీఏ నిబంధనలు లేకపోవడంతో జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి రిజెక్ట్ చేయగా, మరో 20 బస్సులకు మరమ్మతులు చేయిస్తున్నారు.
మూడు బస్సులు సీజ్..
జిల్లాలోని పలు పాఠశాలల ప్రైవేట్ స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండా నడిపిస్తూ రవాణా శాఖ అధికారులకు గురువారం పట్టుబడ్డాయి. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక విజిలెన్స్ అధికారి పాహిమా సుల్తానా (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ని ఆర్టీసీ చౌరస్తాలో తనిఖీలు నిర్వహించారు. ఈతనిఖీల్లో సాన్మారియా స్కూల్కు చెందిన రెండు, చంపక్హిల్స్ న్యూ క్రియేషన్ పాఠశాల ఒక బస్సు ఫిట్నెస్ లేకుండా తిరుగుతుండడంతో విజిలెన్స్ అధికారులను పట్టుకున్నారు. మూడు బస్సులను సీజ్ చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల నిర్లక్ష్యం
నిబంధనలు తుంగలో తొక్కి..
రోడ్డెక్కుతున్న బస్సులు
జిల్లా రవాణా శాఖ ఉక్కుపాదం
విజిలెన్స్ అధికారుల తనిఖీలు
ఒక్కరోజే మూడు బస్సుల సీజ్