ప్రైవేట్‌ మాయా వలయంలో చిన్నారులు | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ మాయా వలయంలో చిన్నారులు

Jun 14 2025 7:43 AM | Updated on Jun 14 2025 7:43 AM

ప్రైవ

ప్రైవేట్‌ మాయా వలయంలో చిన్నారులు

లెక్కకు మించి నోట్‌బుక్‌లు, పాఠ్యపుస్తకాలు

బ్యాగు మోయలేక చిన్నతనంలోనే వెన్ను సంబంధ సమస్యలు˘

జనగామ: ప్రైవేట్‌ స్కూళ్లలో చదివే పిల్లలు బండెడు పుస్తకాల మూట మోయాల్సి వస్తున్నది. చదువుల పేరిట వారిపై మోయలేని భారం మోపుతున్నారు. లెక్కకు మించి నోట్‌బక్స్‌, పాఠ్యపుస్తకాల బ్యాగు భుజాన వేసుకుని ఉదయం బడికి వెళ్లడం, సాయంత్రం తిరిగి రావడంతో అలసటకు గురవుతున్నారు. స్కూల్‌కు వెళ్లిన తర్వాత మొదటి, రెండవ అంతస్తులో ఉన్న తరగతి గదికి బ్యాగుతో చేరుకోవాల్సి ఉంటుంది. భరువు మోయలేక ముక్కుపచ్చలారని చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నా రు. స్కూల్‌ బ్యాగుల బరువు ఎంత ఉండాలనే అంశంపై 2006లోనే ఉమ్మడి రాష్ట్రంలో చట్టం తీసుకువచ్చారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో చిన్నారు ల ‘బ్యాగు మోత’పై కథనం.

శరీర బరువులో 10శాతం మించొద్దు

చిల్ట్రన్‌ స్కూల్‌ బ్యాగ్‌ యాక్టు–2006 ప్రకారం విద్యార్థి శరీర బరువులో పుస్తకాల బరువు 10 శాతం మించకూడదు. అంటే 30 కిలోల బరువు ఉన్న విద్యార్థి 3 కిలోల బరువుకు సమానంగా పుస్తకా ల బ్యాగు ఉండాలి. అయితే ఒకటో తరగతి చదివే విద్యార్థి శరీర బరువు 15 కేజీలు ఉంటే.. పుస్తకాల బ్యాగు 1.5 కిలోలకు బదులుగా 5 కిలోలు ఉంటున్నది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి 35 నుంచి 40 కిలోలు ఉంటే.. పుస్తకాల బరువు దాదాపు 12 కేజీలు దాటుతోంది. దీంతో విద్యార్థుల వెన్ను విలవిల్లాడిపోతోంది. శారీరక, ఎముకలు, కండరాల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మెడ, భుజాలు, వెన్నుముక వంగి పోతున్నాయి. అనేక మంది పిల్లలు వెన్ను నొప్పి బారిన పడుతున్నారు. శ్వాస పూర్తిగా తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతున్నది.

తరగతులకు వెళ్లేందుకు తంటాలు

జిల్లాలో ప్రైవేట్‌ స్కూళ్లు అత్యధికంగా బహుళ అంతస్తుల భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. పుస్తకాల బ్యాగు బరువుతో విద్యార్థులు పైకి వెళ్లేందుకు నరకం చూస్తున్నారు. రెగ్యులర్‌ సిలబస్‌ పుస్తకాలతో పాటు అసైన్‌మెంట్‌, డ్రాయింగ్‌, క్రాఫ్ట్‌, ఆర్ట్‌, జీకే, కంప్యూటర్‌, డైరీ తదితరాలతోపాటు హోంవర్క్‌, ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, సైన్స్‌, మ్యాథ్స్‌, సోషల్‌, ఎన్విరాన్‌ మెంటల్‌ సైన్స్‌.. ఒక్కో సబ్జెక్టుకు 2 నుంచి 4 నోట్‌బుక్స్‌ ఉండడంతో మోయలేని భారంగా తయారైంది.

యశ్‌పాల్‌ కమిటీ నివేదిక ఇలా..

విద్యార్థుల స్కూల్‌ బ్యాగు బరువుపై గతంలోనే కేంద్ర ప్రభుత్వం యశ్‌పాల్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అధ్యయనం చేసిన తర్వాత ‘లెర్నింగ్‌ విత్‌ అవుట్‌ బర్డెన్‌’ పేరుతో నివేదిక వెల్లడించింది. దాదాపు 90 శాతం పాఠశాలల్లో ఆహ్లాదకరంగా లేని బోధన సాగుతోందని, ఫలితంగా విద్యార్థులు మానసిక వేదనకు గురువుతున్నారని పేర్కొంది. దీనికి తోడు అవసరానికి మించిన పుస్తకాలు విద్యార్థుల ప్రతిభకు అడ్డంకిగా మారుతున్నాయని వ్యాఖ్యానించింది. ఈ నివేదిక ప్రకారమే 2006లో స్కూల్‌ బ్యాగులపై చట్టం తీసుకువచ్చారు.

నియమ నిబంధనలు:

● నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులు పుస్తకాలు మోయకూడదు.

● ఇతర తరగతికి చెందిన విద్యార్థుల బ్యాగులు శరీరం కంటే 10శాతానికి మించకూడదు.

● స్కూల్‌ బ్యాగు బరువు, రోజు తీసుకురావాల్సిన పుస్తకాలపై శాసీ్త్రయ అంచనాలతో తల్లిదండ్రులకు పాఠశాలలు మార్గదర్శకాలు ఇవ్వాలి.

● కేవలం పాఠ్యపుస్తకాలు మాత్రమే స్కూల్‌ బ్యాగులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.

● మిగిలిన పుస్తకాలు స్కూల్‌లో భద్ర పరుచుకునేలా పాఠశాలల యాజమాన్యాలు లాకర్‌, డెస్క్‌ ఏర్పాటు చేయాలి. ఈ నిబంధనలు పాటించక పోతే ఆయా స్కూళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి

స్కూల్‌ బ్యాగుల అధిక బరువుతో పిల్లలు చిన్న తనంలోనే అనేక అనా రోగ్య సమస్యల బారిన పడుతున్నారు. చట్టంలోని నిబంధనల మేరకు స్కూల్‌ బ్యాగ్‌ బరువు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలి. విద్యార్థులు ఇంటికి వెళ్లే సమయంలో హోం వర్క్‌ ఇచ్చిన పుస్తకాలు మినహా మిగతావి బడిలోనే ఉండేలా చూడాలి. ఇలా చేయకుంటే వెన్నుపూసపై తీవ్ర ప్రభావం పడుతుంది. పిల్లల ఎదుగుదల విషయంలో దుష్ఫలితాలు ఉంటాయి. బ్యాగుల మోతపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించక పోతే ఎదిగే పిల్లలను అనారోగ్య సమస్యలు జీవితాంతం వెంటాడుతాయి.

– కల్నల్‌, డాక్టర్‌ భిక్షపతి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌,

ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, ఎండీ (మెడిసిన్‌)

ప్రైవేట్‌ మాయా వలయంలో చిన్నారులు1
1/2

ప్రైవేట్‌ మాయా వలయంలో చిన్నారులు

ప్రైవేట్‌ మాయా వలయంలో చిన్నారులు2
2/2

ప్రైవేట్‌ మాయా వలయంలో చిన్నారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement