
వచ్చుడు..ఇచ్చుడు..పోవుడే..
ఏళ్ల తరబడి తిరుగుతున్నా.. పరిష్కారం కాని సమస్యలు
వినతుల్లో కొన్ని ఇలా..
● బచ్చన్నపేట మండలం సాల్వాపూర్ గ్రామానికి చెందిన జయంతి, అంజలి, అనిత, కమలమ్మ, నవనీత, లక్ష్మీ, కవితలు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లు లొకేషన్ రావడం లేదని, సమస్యను పరిష్కరించాలని కోరారు.
● కొడకండ్ల మండలం నీలిబండతండా గ్రా మానికి చెందిన గుగులోతు భీకి తన 6.24 ఎకరాల భూమిని పెద్ద కుమారుడు అక్రమంగా పట్టా చేయించుకొని ఇబ్బందులు పెడుతున్నాడని, ఆ భూమి మొత్తం రద్దు చేసి, తన పేరు మీదకు పట్టా చేయాలని వినతిపత్రం ఇచ్చారు.
● జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన కొంగరి రమ, 40 ఏళ్లుగా సొంత గ్రామంలో నివాసం ఉంటున్నానని, తనకు 80 గజాల స్థలం ఉందని, ఎటువంటి భూములు, ఇల్లు, ఆస్తులు లేవని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
● జనగామ మండలంలోని యశ్వంతాపూర్ గ్రామ పరిధిలో గల రెహమాన్ బీఈడీ కళాశాలలకు వెళ్లే దారి, రైతులు పొలాల వద్దకు వెళ్లే దారిని రాళ్లు పాతి దారి మూసివేయడంతో విద్యార్థులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని కళాశాల యజమాని ముజిబూర్ రహెమాన్, వంగాల ఎల్లేష్, రైతులు వినతిపత్రం అందించారు.
●రెండు దశాబ్ధాలుగా తమ విలువైన సమయం కేటాయించి ఉద్యమం చేశామని, ప్రభుత్వం ఉద్యమకారులను దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా ఆదుకోవాలని తెలంగాణ ఉత్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా ఉద్యమకారులు మణి, గంగా భవాని కలెక్టరేట్లో వినతి అందజేశారు.
జనగామ రూరల్: దూర ప్రాంతాల నుంచి తమ సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్కు వచ్చి దరఖాస్తులు ఇచ్చుడే కాని పరిష్కారం కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. భూ సమస్యల పరిష్కారానికి ఏళ్ల తరబడి తిరుగుతున్నామని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంటి స్థలాన్ని ఆక్రమించారని, పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నామని, కళాశాలకు, రైతుల పొలాలకు వెళ్లడానికి దారిని మూసివేశారని, భూమిని అక్రమం పట్టా చేస్తున్నారని ఇలా పలు సమస్యలతో బాధితులు ప్రజావాణికి వచ్చారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్లో భాగంగా అదనపు కలెక్టర్లు రోహిత్ సింగ్, పింకేష్ కుమార్లు ఇతర అధికారులతో కలిసి ప్రజల నుంచి 85 వినతులను స్వీకరించారు. అనంతరం తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలన్నారు. పెండింగ్ దరఖాస్తులో దృష్టి సారించాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద వచ్చిన దరఖాస్తులను బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల్లోని ఉప కులాల వారీగా అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. నిరుపేదలకు ప్రథమ ప్రాధాన్య కల్పిస్తూ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్లు సుహాసిని, హనుమాన్ నాయక్, డీఆర్డీఓ వసంత, డీపీఓ స్వరూప, డీఏఓ రామారావు నాయక్, గృహ నిర్మాణ శాఖ అధికారి మాతృనాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పక్క ఫొటోలో కనిపిస్తున్న మహిళ పట్టణంలోని ఐదో వార్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన గణపురం మౌనిక. తన ఇంటి పక్కన సర్వీసు రోడ్డు కోసం వదిలిన ప్రభుత్వ స్థలాన్ని కొంత మంది కబ్జా చేశారు. అలాగే 28/1 నంబర్తో ఓ నకిలీ పట్టా సృష్టించారని, అంతటితో ఆగకుండా తమ ఇంటిని కూడా కబ్జా చేయాలని చూస్తున్నారని, ఇల్లు వదిలిపోవాలని బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోయింది. సదరు కబ్జా స్థలంపై సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలని గ్రీవెన్స్లో అధికారులను వేడుకుంది.
గ్రీవెన్స్లో 85 దరఖాస్తులు
అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి
అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్
అక్రమంగా పట్టా చేసుకున్నారు..
గ్రామంలో సర్వే నంబర్ 121లో ఎకరం భూమి ఉంది. ఏళ్ల తరబడి ఖాస్తులో ఉన్న. తమ బంధువులు తమకు తెలవకుండా అక్రమంగా పట్టా చేసుకున్నారు. భూమి ఇవ్వమంటే బెరిస్తున్నారు. పింఛన్తో బతకలేకపోతున్న. విచారణ చేపట్టి న్యాయం చేయాలి.
– బోడిపెల్లి ఐలమ్మ,
లక్ష్మీనారాయణపురం, పాలకుర్తి
పింఛన్ నిలిపేశారు
9 ఏళ్ల క్రితం పక్షవాతం రాగా ఎడమ చేయి, కళ్లు కనబడటం లేవు. 2019లో సదరం సర్టిఫికెట్తో దివ్యాంగ పింఛన్ మంజూరు అయింది. సర్టిఫికెట్ సమయం గడిచిపోగా మళ్లీ క్యాంప్ ద్వారా సర్టిఫికెట్ పొందాను. అయితే గత రెండు నెలల నుంచి పింఛన్ రావడం లేదు. మందులకు కూడా డబ్బులు లేవు. పింఛన్ ఇచ్చి ఆదుకోవాలి.
– అలేటి ప్రభాకర్, వడ్లకొండ, జనగామ

వచ్చుడు..ఇచ్చుడు..పోవుడే..

వచ్చుడు..ఇచ్చుడు..పోవుడే..

వచ్చుడు..ఇచ్చుడు..పోవుడే..