
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
జనగామ రూరల్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందించాలన్నదే ప్రభుత్వ ఉద్ధేశ్యమని గృహ నిర్మాణ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో ఆయన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, దరఖాస్తుదారుల పరిశీలన ప్రక్రియపై అన్ని మండలాల ఎంపీడీఓలు, ఏఈలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు అర్హులకే మంజూరు చేయాలని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు. ఇందిరమ్మ ఇల్లు 600 చదరపు అడుగులు ఎక్కువ కాకుండా, 400 చదరపు అడుగుల తక్కువ కాకుండా నిర్మించాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి నూతన పద్ధతులు ఉపయోగించాల, వాటిపై అవగాహన పెంపొందించాలన్నారు. పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని, ఎప్పటికప్పుడు సర్వే చేసిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల అర్హుల ఎంపికకు చేపట్టిన సర్వేను వేగవంతం చేయాలన్నారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ కింద పైలట్ గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాల మంజూరుకు పోర్టల్లో వివరాలను నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఆర్డీఓ గోపీరాం, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చైతన్య కుమార్, ఎంపీడీఓలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణాల పరిశీలన
లింగాలఘణపురం: మండలంలోని కొత్తపల్లిలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను, వనపర్తిలో రెండో విడత లబ్ధిదారుల జాబితాలో అధికారులు చేపట్టిన విచారణ ఏ విధంగా జరుపుతున్నారనే విషయాలను బుధవారం గృహ నిర్మాణ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలతో పూర్తి చేసుకోవాలని సూచించారు. వనపర్తిలో రెండో విడత లబ్ధిదారుల జాబితాలో అధికారులు నిర్వహిస్తున్న తీరును పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. కలెక్టర్ రిజ్వాన్బాషా, అదనపు కలెక్టర్ పింకేశ్కుమార్, పీడీ మాతృనాయక్, ఎంపీడీఓ జలేందర్రెడ్డి, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.
గృహ నిర్మాణ కార్పొరేషన్
ఎండీ వీపీ గౌతమ్