
రిజర్వేషన్ల సాధనకు సంతకాల సేకరణ
జనగామ రూరల్: ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ల సాధనకు పోరాటాలు ఉధృతం చేస్తామని, ఇందుకోసమే లక్ష సంతకాలు సేకరిస్తున్నట్లు ఎన్పీఆర్డీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిట్ల గణేశ్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని దుర్గమ్మ గుడి ఆవరణలో జిల్లా అధ్యక్షుడు పాముకుంట్ల చందు అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. దివ్యాంగులను ఐక్యం చేసి పార్లమెంట్ వేదికగా సమస్యలను చర్చించి అనేక సమస్యలను పరిష్కారం చేసేందుకు ఎన్పీఆర్డీ కృషి చేసిందన్నారు. దివ్యాంగులకు 5శాతం ఉద్యోగాల కేటాయింపు తదితర సమస్యల సాధనకు మే 19న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో మామిడాల రాజేశ్వరి, పిట్టల కుమార్, మాలోతు రాజ్ కుమార్, మోతె వెంకటమ్మ, భైరగోని మహేష్, రాజు, గోదల ఐలయ్య, జానకి, సతీష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.