
చట్టాలపై అవగాహన ఉండాలి
● సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్
జనగామ రూరల్: గ్రామాల్లో కమ్యూనిటీ మీడియేటర్లకు చట్టాలపై అవగాహన ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. బుధవారం లీగల్ సెల్ ఆధ్వర్యాన కోర్టు ఆవరణలో చట్టాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేసులు ఎలా పరిష్కరించాలో ముందు తెలుసుకోవాలని సూచించారు. కమ్యూనిటీ మీడియేటర్లుగా శిక్షణ తీసుకున్న వారు 31 మంది ఉన్నారని, ఇందులో చాలామంది రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తోపాటు వివిధ వృత్తుల్లో అనుభవం కలిగిన వారు ఉన్నట్లు పేర్కొన్నారు. వారి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మొత్తంలో కేసులను పరిష్కరించాలని సూచించారు. లీగల్గా తెలియని విషయాలు ఉంటే జిల్లా న్యాయసేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. మండలం, గ్రామాల్లో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లు ఓపెన్ చేయాలని అన్నారు.
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు
● ఈనెల 3వ తేదీ వరకు అవకాశం
జనగామ: ఎల్ఆర్ఎస్ పథకం కింద 25 శాతం రాయితీతో ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం మరో మూడు రోజుల పాటు అవకాశం కల్పిస్తూ బుధవారం జీఓ జారీ చేసింది. మొదటి విడతలో మార్చి 31 వరకు, రెండోసారి ఏప్రిల్ 2 నుంచి 30 వరకు అవకాశం కల్పించింది. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించే సమయంలో సర్వర్ డౌన్, సర్వే నంబర్లపై తగాదా లు, కోర్టు కేసుల నేపథ్యంలో ప్రోహిబిటెడ్ ఆప్షన్ ఉండడం కారణంగా రెగ్యులరైజేషన్ సమయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గ్రామపంచా యతీ, పురపాలిక పరిధిలో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు దరఖాస్తులు ఇబ్బడి, ముబ్బడిగా వచ్చినా.. అవి పెండింగ్లో ఉండడంతో మే 3వ తేదీ వరకు మరోసారి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
రూ.23 కోట్ల ఆదాయం
జిల్లాలోని రెండు మున్సిపాలిటీలు, 12 మండలాల పరిధిలో 12,996 దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. ఇప్పటి వరకు రూ.23.87 కోట్ల ఆదాయం ఫీజు రూపంలో ప్రభుత్వానికి వచ్చింది.
ఏఎంసీ సూపర్వైజర్ సరెండర్
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్ కార్యాలయ సూపర్వైజర్ వి.నాగార్జునపై వచ్చిన పలు ఆరోపణలతో పాటు పాలకవర్గం తీర్మానం మేరకు ఆయనను హెడ్ ఆఫీస్కు సరెండర్ చేస్తూ కలెక్టర్ రిజ్వాన్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ బుధవారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున పనిచేసే సమయంలో అతనిపై చాలా ఫిర్యాదులు వచ్చాయని, కలెక్టర్కు వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో నాగార్జునను రాష్ట్ర మార్కెటింగ్ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు వివరించారు.

చట్టాలపై అవగాహన ఉండాలి