
పురాతన విగ్రహం తల భాగం లభ్యం
జనగామ రూరల్: జనగామ మండల పరిధి శామీర్పేట గ్రామ శివారులోని ఆవునూరి మల్లారెడ్డికి చెందిన వ్యవసాయ పొలంలో బుధవారం కూలీలు ఉపాధి పనులు చేస్తుండగా ఓ పురాతన విగ్రహం తల భాగం బయటపడింది. ఇది 17వ శతాబ్దానికి చెందిన వైష్ణవ భక్తుడి శిల్పంగా తెలుస్తోందని డిస్కవరీ మ్యాన్, పురావస్తు నిపుణుడు రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు. ఇక్కడ ఒక దేవాలయం ఉన్నట్లు ప్రస్తుతం లభించిన ఈ విగ్రహం తల భాగం ఆధారంతో అవగతమవుతోందని అన్నారు. గ్రామంలో ఒక శాసనం ఉందని, దానిపై శివుడు, వినాయకుడు, సూర్యుడి విగ్రహాలు ఉన్నట్లు పేర్కొన్న ఆయన.. దీని ద్వారా ఇక్కడ త్రికూటాలయం ఉందని తెలుస్తున్నదని చెప్పారు. గ్రామంలో గతంలో డంగు సున్నంతో చేసిన పాత్రలు, సున్నపు రాయి లభించాయని వివరించారు.