
పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు
జనగామ రూరల్: జిల్లాలోని ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. మంగళవారం జనగామ మండలంలోని వెంకిర్యాల, గానుగుపహాడ్ పీఏసీఎస్ ధాన్యం సెంటర్లను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల్లో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న సరుకును కలెక్టర్ పరిశీలించి అందులో తేమ శాతాన్ని పరిశీలించారు. రోజువారీగా కొనుగోళ్లకు సంబంధించి రిజిస్టర్లను పరిశీలించి వెంటవెంటనే ఓపీఎంఎస్లో రైతుల వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతులను ఇబ్బందికి గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని నిర్వాహకులను హెచ్చరించారు. అక్కడ నుంచి గానుగుపహాడ్ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించి రిజిస్టర్లను పరిశీలించారు. తిరుగుప్రయాణంలో వడ్లకొండ ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలోని సఖి కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. అందులోని రికార్డులతో పాటు స్టాఫ్ రూం, కౌన్సెలింగ్ గదులను తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ హుస్సేన్, డీటీ సీఎస్ శ్రీనివాస్, రేణుక, అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన వేగవంతం..
ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి వివిధ ప్రభుత్వ పథకాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేసిన లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. రాజీవ్ యువవికాసం దరఖాస్తులు కేటగిరీల వారీగా పరిశీలన చేసి సిబిల్ స్కోర్ నిమిత్తం ఆయా బ్యాంకులకు పంపించాలన్నారు. ఏఏపీ కమిటీల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు.
పీహెచ్సీల్లో ఓపీ సేవలను పెంచండి
ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన
వేగవంతం చేయాలి
కలెక్టర్ రిజ్వాన్ బాషా