
జీపీఓలు
75
మంది
జనగామ: ఇటీవల జీపీఓలుగా నియమించేందుకు నిర్వహించిన పరీక్షకు జిల్లాలో 116 మంది వీఆర్ఏ, వీఆర్ఓలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా 75 మంది జీపీఓలుగా అర్హత సాధించారు. బీఆర్ఎస్ హయాంలో వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను మంగళం పాడి.. రెవెన్యూ వ్యవస్థలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. ధరణి పోర్టల్ను తీసుకువచ్చి.. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించారు. వీఆర్ఏ, వీఆర్ఓల అర్హత ఆధారంగా ఆయా శాఖలో విలీనం చేయగా... రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారంలో పెద్ద లోటు ఏర్పడింది. తహసీల్దార్, ఆర్డీఓ పరిధిలో ఉన్న పలు ఆప్షన్లను తొలగించడంతో రైతులు కొంత మేర ఇబ్బందులు పడ్డారు. ధరణి పోర్టల్పై వచ్చిన నిరసన నేపధ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సమూల మార్పులు తీసుకు వస్తామని అనేక సభల్లో నేతలు వాగ్దానాలు చేశారు. గతేడాది జరిగిన సాధారణ ఎలక్షన్లో సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే... ధరణి పోర్టల్కు స్వస్తి పలికి భూ భారతికి శ్రీకారం చుట్టారు. గతంలో ఉన్న నిబంధనలను తిరిగి అమలులోకి తీసుకు రావడంతో పాటు వీఆర్ఓ, వీఆర్ఏల స్థానంలో గ్రామ పరిపాలన అధికారుల (జీపీఓ) వ్యవస్థను తీసుకువచ్చారు.
75 మంది క్వాలీఫై
జిల్లాలో 12 మండలాలు, 280 గ్రామ పంచాయతీలు ఉండగా, 176 రెవెన్యూ విలేజ్లు ఉన్నాయి. గతంలో వీఆర్ఓ, వీఆర్ఏలుగా పని చేస్తూ ఇతర శాఖల్లో పని చేస్తున్న వారికి కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి మాతృశాఖకు వచ్చేందుకు అవకాశం కల్పించింది. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ స్థానంలో కొత్తగా జీపీఓగా నామకరణం చేసింది. నేరుగా జీపీఓగా బాధ్యతలను స్వీకరించేందుకు, ఇంటర్, డిగ్రీ అర్హత నిబంధన విధించారు. అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులను కోరారు. జిల్లాలో 116 మంది వీఆర్ఏ, వీఆర్ఓలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో 97 మంది అర్హత సాధించారు. ఇందులో 86 మంది రాత పరీక్షకు హాజరు కాగా, 11 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలో 75 మంది జీపీఓలుగా అర్హత సాధించారు. ఇందులో ఒక్కరు నాట్ విల్లింగ్ ఇవ్వగా, ముగ్గురు ఇతర జిల్లాలకు ఆప్షన్ ఇచ్చారు. మిగిలిన 71 మందికి జనగామ సొంత జిల్లాలో పని చేసే అవకాశం వచ్చింది. ఆప్షన్ ప్రక్రియ ముగిసిపోగా...జీపీఓలను జిల్లాల వారీగా అలాట్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే, కలెక్టర్ రిజ్వాన్ బాషా ఒక్కో జీపీఓకు రెండు నుంచి మూడు గ్రామాల బాధ్యతలను అప్పగించనున్నారు.
జీపీఓల విధులివే..
● రెవెన్యూ రికార్డులు, లెక్కలను సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహించడం.
● భూమిశిస్తు, సెస్సులు, పన్నులు, ఇతర బకాయిలను వసూలు చేయాలి.
● సర్వే రాళ్లు తనిఖీ.
● జన్మస్థల ధ్రువపత్రములు, సాల్వెన్సీ, నివాస, సర్టిఫికెట్లు, జారీ
● పహాణి, అడంగల్ తదితర పనులు.
● అగ్ని ప్రమాదాలు, వరదలు, తుఫానులు ఇతర విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ఉన్నతాధికారులకు సమాచారం అందించడం.
● ప్రభుత్వ భూములు, చెరువులు, చెట్లు, ఇతర ఆస్తుల పరిరక్షణ.
● పురాతన కట్టడాల కూల్చివేత, శిలాశాసనాలు, స్మారక చిహ్నాలు లభ్యమైన సమయంలో తహసీల్దార్లకు సమాచారం అందించాలి.
● ఓటర్ల జాబితాల తయారీ, అప్డేట్, సవరణ సమయంలో సహకారం.
● హత్యలు, ఆత్మహత్యలు, అసహజ మరణాలు, గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిన వెంటనే పోలీసు శాఖకు సమాచారం అందించాలి.
● ఇందిరమ్మ, ఇందిరప్రభ, ఇందిర క్రాంతి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తదితర ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సహకరించాలి.
● మలేరియా, మెదడువాపు, అతిసారం వంటి వ్యాధులు ప్రబలిన సమయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తక్షణం తెలియజేయాలి.
అభివృద్ధి కార్యక్రమాల్లో
ముఖ్యభూమిక పోషిస్తాం..
మాతృ సంస్థ రెవెన్యూ వ్యవస్థలో తిరిగి పని చేసే అవకాశం కల్పించిన సీఎం రేవంత్రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్య భూమిక పోషిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తాం.
– పెండెల శ్రీనివాస్, జీపీఓ
●
116 మంది పరీక్షకు హాజరు,
75 మంది క్వాలీఫై
జిల్లాలో 176 రెవెన్యూ గ్రామాలు
ఒక్కో జీపీఓకు రెండు నుంచి మూడు గ్రామాల బాధ్యతలు
సీఎం చేతుల మీదుగా త్వరలో
ఆర్డర్ కాపీలు!

జీపీఓలు

జీపీఓలు