
‘భూ భారతి’తో భూ సమస్యల పరిష్కారం
జనగామ రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి చట్టంతో ప్రజల భూ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని, రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. మంగళవారం జనగామ మండలం పెంబర్తి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూసదస్సు నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తొలి విడత సదస్సులు విజయవంతంగా ముగిశాయని, జూన్ 20వ తేదీ వరకు రెండో విడత రెవెన్యూ సదస్సులు జరుగుతాయన్నారు. భూ రికార్డులో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్–బిలో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు సదస్సులో స్వీకరించి భూభారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిర్దేశిత గడువు లోపు సమస్యలను పరిష్కరిస్తారన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందన్నారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అంతకుముందు ఆర్డీఓ గోపిరామ్ దరఖాస్తు ప్రక్రియను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హుస్సెన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
రశీదు తప్పనిసరిగా ఇవ్వాలి
లింగాలఘణపురం: రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకున్న రైతులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. మంగళవారం లింగాలఘణపురం మండలం నాగారం గ్రామాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
‘బక్రీద్’ను ప్రశాంతంగా జరుపుకోవాలి
జనగామ రూరల్: బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, అదనపు కలెక్టర్ రోహిత్సింగ్లతో కలిసి ముస్లింలు, హిందువులతో కలిసి శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గోవధ నిషేధమని, గోమాతను పరిరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ అధికారి రాధాకిషన్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లపై సంబంధిత శాఖ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. అర్హులకు మంజూరు పత్రాలు అందించి 9వ తేదీలోపు ముగ్గుపోసిన ఫొటోలను యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. అలాగే రేషన్ సన్నబియ్యం పంపిణీ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.