
ఆస్పత్రుల్లో సిబ్బందిని నియమించాలి
చిల్పూరు: పశువుల ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలని జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణాజీగూడెం గ్రామంలో మంగళవారం గొర్రెలమేకల పెంపకం దారుల సంఘం జిల్లా కమిటీ సమావేశం అధ్యక్షుడు మోటె దేవేందర్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రవీందర్ హాజరై మాట్లాడుతూ పాడి పరిశ్రమతోనే ప్రభుత్వాలకు ఆదాయం వస్తుందంటూ ఒకపక్క నాయకులు అంటూనే మరోపక్క వాటి సంక్షేమాన్ని పట్టించుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారన్నారు. రెండేళ్లుగా గొర్రెలుమేకలు, పాడి పశువులకు ప్రభుత్వం నుంచి కనీసం నట్టల మందులను ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఒక్క అటెండర్ పోస్టును భర్తీ చేయలేదని, కనీసం నేటికి పశుసంవర్ధక శాఖ మంత్రిని నియమించలేదన్నారు. ప్రభుత్వం వెంటనే అన్ని ఆస్పత్రుల్లో సిబ్బందిని నియమించాలని, అన్ని రకాల మందులను పాడి రైతులకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాదం రమేష్, బాలరాజు, రమేష్, రాజబీరయ్య, మేకల మల్లేష్, చంద్రయ్య, బోళ్ల రాజ్కుమార్, ఆవుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు షురూ
జనగామ రూరల్: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయని డీఈఓ డి.భోజన్న మంగళవారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధర్మకంచలో జరిగిన తెలుగు పరీక్షలో 51 మంది విద్యార్థులకు గాను 48 మంది హాజరు కాగా 3 గైర్హాజరయ్యారన్నారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాన్ని డీఈఓ, ఏసీజీఈ రవికుమార్లు సందర్శించారు.
సందీప్కు రాష్ట్ర ప్రతిభా పురస్కారం
పాలకుర్తి టౌన్: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన ఈగ సందీప్ రాష్ట్ర ప్రతిభా పురస్కారం అందుకున్నారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీధర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ బీసీ సంక్షేమ బాలుర హాస్టల్లో ఉంటూ సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో చదివి పదో తరగతిలో 557 మార్కులు సాధించారు. దీంతో విద్యార్థికి ప్రోత్సాహకంగా మెమెంటోను అందించారు. జిల్లా నుంచి బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థి పురస్కారం అందుకోవడంతో జిల్లా బీసీ సంక్షేమ అధికారి రవీందర్గౌడ్ విద్యార్థి సందీప్ను అభినందించారు.
స్టేషన్ఘన్పూర్లో
18 వార్డుల కేటాయింపు
స్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీకి అధికారికంగా 18 వార్డులను కేటాయించినట్లు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ టీకే శ్రీదేవి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వార్డుల వారీగా పబ్లిక్ నోటిఫికేషన్ను మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తామని, ఏమైనా అభ్యంతరాలుంటే కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
నేటి నుంచి పరిశోధన పద్ధతులపై తరగతులు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 4 నుంచి 10వ తేదీ వరకు పరిశోధనా పద్ధతులపై అవగాహన తరగతులు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను ఆ విభాగాధిపతి డాక్టర్ సంకినేని వెంకట్, బీఓఎస్ డాక్టర్ కిష్టయ్యతో కలిసి ఆవిష్కరించారు. యూనివర్సిటీకి చెందిన సీనియర్ ఆచార్యులతో ఈఅవగాహన తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సోషల్ సైన్సెస్ పరి శోధకులు కూడా ఈపరిశోధనా పద్ధతుల అవగాహన తరగతుల్ని వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 4న ఈతరగతులను కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, సోషల్ సైన్స్ ఆచార్య టి.మనోహర్ ప్రారంభిస్తారని సంకినేని వెంకటయ్య తెలిపారు. అధ్యాపకులు సత్యనారాయణ, నాగరాజు పాల్గొన్నారు.