జనగామ రూరల్: ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డీఏలు, పీఆర్సీ ఇవ్వలేమనడం సరికాదని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ఎన్ఎన్ రాజు విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఉమాపతి భవన్లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు నాలుగు వాయిదాల డీఏను, జులై 2023 నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీని అడగొద్దని, అవి కావాలంటే నెలనెలా జీతాలే ఇవ్వలేమని ముఖ్యమంత్రి ప్రకటించటాన్ని తీవ్రంగా ఖండించారు. సగం మంది ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మాత్రమే నెల మొదటి తేదీన వేతనాలు ఇవ్వడం మినహా మరే సమస్య పరిష్కారం కాలేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంకుశావలి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కుర్రేముల యాదగిరి, బి. లక్ష్మయ్య, వజ్రయ్య, రాజా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
శ్రీనివాస్