వంటల్లో నూనె తగ్గించండి | - | Sakshi
Sakshi News home page

వంటల్లో నూనె తగ్గించండి

Mar 22 2025 1:18 AM | Updated on Mar 22 2025 1:13 AM

అధిక నూనెతో అనర్థాలు

అధిక నూనె వినియోగంతో ఊబకాయం, గుండె జబ్బు, జీర్ణ సమస్యలు వస్తున్నాయి. విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంతో పాటు తక్కువ నూనెతో తాజా, పోషకమైన భోజనం తయారు చేసి వడ్డించేలా చూడాలి. విద్యార్థులకు అందించే ఫోర్టిఫైడ్‌ ఎడిబుల్‌ ఆయిల్‌లో విటమిన్‌ ఏ, డీ సమృద్ధిగా ఉంటుందని గమనించాలి. అలాగే పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన న్యూట్రిషన్‌ గార్డెన్‌ కూరగాయలను వినియోగించడం ద్వారా విద్యార్థులు గార్డెన్‌లో చురుగ్గా పాల్గొనడంతో పాటు పౌష్టికాహారంపై అవగాహన, ప్రకృతితో కనెక్టివిటీ పెరుగుతుంది. తక్కువ నూనె ఆహారంపై హోమ్‌ సైన్స్‌ కళాశాల, వైద్యులు, పోషకాహార నిపుణులచే తరగతి గదిలో సెమినార్లు నిర్వహించాలి.

జనగామ: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. చిన్న తనంలోనే ఊబకాయం, జీర్ణకోశ సంబంధిత సమస్యలు, గుండె జబ్బుల బారిన పడుతుండంతో మధ్యాహ్న భోజనం తయారీలో స్వల్ప మార్పులు తీసుకువస్తూ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రోజువారీగా మధ్యాహ్న భోజనంలో కూరల్లో 10 శాతం వంట నూనె తగ్గించాలని పేర్కొనడంతో పాటు.. ఆరోగ్యకరమైన పలు సూచనలు చేసింది.

బాల్యంలోనే ఆరోగ్య సమస్యలు

బాల్యంలోనే ఊబకాయం సమస్య తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శ్రీపరీక్షా పే చర్చా–2025, మన్‌ కీ బాత్‌శ్రీ కార్యక్రమాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. 1990 సంవత్సరంలో అధిక బరువుతో 0.4 మిలియన్ల ప్రజలు ఉండగా.. ప్రస్తుతం 15 నుంచి 19 ఏళ్ల వయసు మధ్య 12.5 మిలియన్లకు చేరుకుందని లాన్సెట్‌ జర్నల్‌ లెక్కల ప్రకారం నివేదించారు. ఇందులో అమ్మాయిల కంటే అబ్బాయిలే అధికంగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. జీవన శైలి, ఆహార అలవాట్లలో మార్పులు రావడంతో అనేక రోగాల బారిన పడుతున్నారని గుర్తించారు. దీంతో బడిలో వడ్డించే మధ్యాహ్న భోజనంలో 10 శాతం వంట నూనె వినియోగాన్ని తగ్గించడంతో పాటు ఆచరణాత్మక సలహాలను సూచిస్తూ రాష్ట్రాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వంట నూనె వినియోగంపై ఎస్‌ఎంసీల ఆధ్వర్యాన ప్రత్యేక సమావేశాలు, డిబేట్లు, వ్యాసరచన పోటీల ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవగాహన కల్పించాలి. అలాగే కుక్‌, హెల్పర్లలకు శిక్షణ ఇవ్వాలి. అదనపు కేలరీలను ఖర్చు చేయడానికి విద్యార్థులకు వ్యాయామం, యోగా ప్రాముఖ్యతను వివరించాలి. నూనెతో డీప్‌ ఫ్రై చేయడానికి బదులు గ్రిల్లింగ్‌, స్టీమింగ్‌, బేకింగ్‌ వంటి ఆరోగ్యకరమైన వంట పద్ధతులను అవలంభిస్తే మేలని కేంద్రం సూచించింది.

ఆహారపు అలవాట్లపై పోటీలు..

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై పాఠశాల స్థాయి క్విజ్‌, వ్యాసరచన, ఏకో క్లబ్‌ కార్యకలాపాలు, సమూహంగా చర్చలు, తదితర పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందించాలి. వ్యాయామం, యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ.. విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవనశైలిని పొందే విధంగా ఉపాధ్యాయులు చొరవ చూపించాలి. ప్రతి విద్యార్థి శారీరక శ్రమను పెంచేందుకు తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేస్తూ శిక్షణ ఇవ్వాలి. ఇంట్లోనూ తక్కువ నూనె వాడకాన్ని ప్రోత్సహించేలా సోషల్‌ మీడియాలో చిత్రాల ద్వారా ప్రచారం చేపట్టాలి. 10శాతం తగ్గించిన నూనెతో కూడిన ఆహార పదార్థాలను అందించేందుకు పాఠశాల క్యాంటీన్లను ప్రోత్సహించాలని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను మరింత బలోపేతం చేసేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తూ పాఠశాల నిర్వహణ కమిటీల ఆధ్వర్యాన సమావేశాలు నిర్వహించాలి.

బాల్యంలోనే ఊబకాయం సమస్య

విద్యార్థుల్లో ఆరోగ్య అలవాట్లు పెంపొందించాలి

న్యూట్రిషన్‌ గార్డెన్‌ కూరగాయలు వాడాలి

కేంద్ర ఉత్తర్వులు.. డీఈఓలకు ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement