జనగామ: జనగామ మార్కెట్ అధికారులు ఫీజు వసూళ్లపై ప్రత్యేక ఫోకస్ సారించారు. మొండి బకాయిదారులపై నోటీసు అస్త్రాలతో రంగంలోకి దిగారు. ఈ నెల 31వ తేదీ వరకు చివరి అవకాశం ఇచ్చిన అధికారులు... ఆ తర్వాత 1 శాతం ఫీజుపై 12 శాతం వడ్డీ (ఫెనాల్టీ) వసూలు చేయనున్నారు. అప్పటికీ బకాయిలపై స్పందించకుంటే లైసెన్స్ రద్దుతో పాటు రెవెన్యూ రికవరీ యాక్టు సైతం అమలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్ పరిధిలో 54 ట్రేడ్ లైసెన్స్లు ఉన్నాయి. ఇందులో 20 మంది వరకు మార్కెట్ పరిధిలో కొనుగోళ్లు చేస్తుండగా, మిగతా ట్రేడర్లు రైస్మిల్లు వద్దనే సరుకులను తీసుకుంటారు. సుమారు 15 మంది ట్రేడర్లు రూ.30 లక్షలకు పైగా ఫీజు బకాయి ఉన్నారు. వందశాతం ఫీజు వసూళ్లే లక్ష్యంగా మార్కెట్ అధికారులు నడుంబిగించారు. 15 మందికి నోటీసులు జారీ చేసి, ఈ నెల 31వ తేదీ లోపు బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ విషయమై మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, డీఎంఓ, ఇన్చార్జ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి నరేంద్ర మాట్లాడుతూ 15 మంది ట్రేడర్లకు నోటీసులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు.