జనగామ: తెలంగాణలో ప్రస్తుతం వచ్చిన కరువు.. కాలం తెచ్చింది కాదు.. రేవంత్రెడ్డి ప్రభుత్వం తెచ్చినదే అని, తెలంగాణకు పట్టిన గ్రహణం సీఎం అని.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవా రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దంపతులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి చేపల పులుసు తింటే.. బాబును ప్రజాభవన్కు పిలిచి అడుగులకు మడుగులు ఒత్తింది రేవంత్రెడ్డి కాదా.. అని ప్రశ్నించారు. కృష్ణా నదిలో రేవంత్రెడ్డి గురువు చంద్రబాబునాయుడు నీళ్లు దోచుకుపోతుంటే కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ధ్వజమెత్తారు. సీఎం, మంత్రికి బాబును ప్రశ్నించే దమ్ము, ధైర్యం లేదని, యాసంగి సీజన్ పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలన చేతకాక ప్రకృతి, ప్రతిపక్షాలపై నిందలు వేసి రేవంత్రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. ఎండల తీవ్రతతో పంటలు ఎండిపోతుంటే కేసీఆర్, హరీశ్రావు సంతోషపడుతున్నారని సీఎం అనడం ఆయన రాజకీయ దివాలాకోరు తనానికి నిదర్శనమని అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఎండలు లేవా.. ఆనాడు ఒక్క ఎకరం ఎందుకు ఎండలేదు.. ఈ రోజు సాగు నీటి కష్టాలు ఎందుకు వచ్చాయో కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేవాదుల ఓఅండ్ఎం కాంట్రాక్టర్కు రూ.7వేల కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో 33 రోజులపాటు దేవాదుల పంపు మోటార్లను ఆన్ చేయలేదని, రేవంత్ రెడ్డి చేసిన తప్పును ప్రకృతి మీద మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. గోదావరిలో ప్రవాహం ప్రారంభం కాగానే మోటార్లు ఆన్చేసి రిజర్వాయర్లు, చెరువులు నింపితే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే లక్ష ఎకరాలు ఎండిపోయాయని, మహబూబ్నగర్, నల్గొండలో పంటలు ఎండిపోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డగోలుగా కృష్ణానది జలాలను దోచుకోవడమే కారణమన్నారు. దేవాదుల ఫేజ్–3 మోటార్లను వెంటనే ఆన్చేస్తే అదనపు నీటిని తెచ్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వానాకాలం సీజన్లో కొనుగోలు చేసిన సన్నధాన్యానికి అందించే బోనస్ రూ.400 కోట్ల మేర పెండింగ్లో ఉందని తెలిపారు. ప్రస్తుతం నష్టపోయిన ప్రతీ ఎకరాకు ప్రభుత్వం రూ.20 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూముల క్లియరెన్స్, గ్రేటర్ కమ్యూనిటీలకు అనుమతుల కోసం రేవంత్రెడ్డి ప్రభుత్వం 20 శాతం కమీషన్లు దండుకుంటుందని ఆరోపించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో శాసన మండలి బీఆర్ఎస్ శాసన సభాపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్, పాడి కౌశిక్రెడ్డి, నాయకులు మేకల కలిగంరాజు, తాళ్ల సురేష్రెడ్డి, సంపత్, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, మసిఉర్ రెహమాన్, సమ్మద్, అనిత, స్వరూప, సుధ, నాగరాజు, యాదగిరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బాబుకు గురుదక్షిణతోనే.. ఎడారిగా రాష్ట్రం
విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి హరీశ్రావు