కొడిమ్యాల: జేఎన్టీయూ (నాచుపల్లి)లో ఆదివారం ‘నీట్’ ప్రశాంతంగా ముగిసింది. కళాశాలలో రెండు సెంటర్లను ఏర్పాటు చేశారు. ఒక సెంటర్లో 240 మంది విద్యార్థులకు 234 మంది, మరో సెంటర్లో 196 మందికి 192 మంది హాజరయ్యారు. పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు లేకపోవడంతో పలువురు విద్యార్థులు అవస్థలు పడ్డారు. ఒక విద్యార్థిని చెవికమ్మలు తీయమనడంతో తీసే క్రమంలో చెవికమ్మ ఎక్కడో పడిపోవడంతో అసహనం వ్యక్తం చేసింది. సరిపడా బస్సులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం ఐదు గంటలకుపరీక్ష రాసి బయటకు వచ్చే క్రమంలో రద్దీతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది.
కేంద్రాల తనిఖీ
జగిత్యాలటౌన్: జగిత్యాల ఎస్కేఎన్ఆర్ (ప్రభుత్వ) కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 360మంది విద్యార్థులకు 355మంది హాజరయ్యారు. జిల్లాలో మొత్తంగా 98.11శాతం విద్యార్థులు పరీక్ష రాసినట్లు కో–ఆర్డినేటర్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఎస్కేఎన్ఆర్ పరీక్షా కేంద్రాన్ని అదనపు కలెక్టర్ లత పరిశీలించారు.


